TG Govt: 'వివాదం ఈనాటిది కాదు' హెచ్ సీయూ భూముల వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన

by Prasad Jukanti |   (  Updated:2025-03-31 10:16:43  IST  )

కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

TG Govt:  వివాదం ఈనాటిది కాదు హెచ్ సీయూ భూముల వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో/దిశ, శేరిలింగంపల్లి : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూములకు సంబంధించి విద్యార్థులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ భూములపై రాష్ట్ర ప్రభుత్వం (Government of Telangana) కీలక ప్రకటన చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం కంచె గ‌చ్చిబౌలిలోని (Kanche Gachibowli Land) 400 ఎక‌రాల భూమి ప్రభుత్వానిదేనని, ఇందులో సెంట్రల్ యూనివ‌ర్సిటీ చెందిన భూమి లేదని స్పష్టం ఇవాళ ప్రకటన విడుదల చేసింది. 2004లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ భూమిని ఓ ప్రైవేట్ సంస్థకు కేటాయించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సుప్రీంకోర్టులోని ఈ కేసుల్లో చట్టపరంగా గెలిచి ఈ భూమికి సంబంధించిన యాజమాన్యాన్ని దక్కించుకుందని వెల్లడించింది. దీనిపై ఎటువంటి వివాద‌మైనా కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరించింది. ప్రభుత్వం స్థానిక సుస్థిర అభివృద్ధి, పర్యావరణ అవసరాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని, ప్రాజెక్టును వ్యతిరేకించే వారు రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారుల ప్రయోజనాలకు అనుగుణంగా విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించింది. ఈ భూములపై కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన తప్పుదోవ పట్టించే కథనాలు టీజీ ఐఐసీ దృష్టికి రావడంతో వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతున్నట్లు పేర్కొన్నది. మరోవైపు టీజీఐఐసీకి కేటాయించిన స్థలాన్ని చదును చేసే ప్రక్రియను ఇవాళ రెండో రోజు కూడా విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనల నేపథ్యంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది.

2004లో ప్రైవేట్ సంస్థకు..

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలి గ్రామంలో సర్వే నంబర్ 25 లోని 400 ఎకరాల భూమిని 13 జనవరి 2004లో నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడా వసతుల అభివృద్ధి కోసం ఐఎంజీ అకడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్‌కు (IMG Academies Bharat Private Limited) కేటాయించింది. ఐఎంజీ అకడమీస్ ఈ ప్రాజెక్టును ప్రారంభించకపోవడంతో 2006 నవంబర్ 21న నాటి రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్: 111080/S1/2003 ప్రకారం ఆ కేటాయింపులను రద్దు చేసి ఏపీ యూత్ అడ్వాన్స్‌మెంట్ టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్‌మెంట్‌కు దాన్ని కేటాయించింది. ఈ కేటాయింపులపై ఐఎంజీ అకడమీస్ 2006లో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయగా సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత 7 మార్చి 2024న రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు (High Court) ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ తీర్పుపై ఐఎంజీ అకడమీస్ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా 3 మే 2024న ఐఎంజీ అకడమీస్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానికి దక్కింది. అనంతరం టీజీ ఐఐసీ విజ్ఞప్తితో శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్, తహశీల్దార్ రెవెన్యూ రికార్డుల ప్రకారం కంచె గచ్చిబౌలి లోని 400 ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిగా నిర్ధారించి ఆక్రమణలకు గురికాకుండా తర్వాత అభివృద్ధి పనులకు గాను ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని అధికారులు సూచించారు.

గతేడాది టీజీ ఐఐసీకి బదిలీ..

ఆ తర్వాత 2022 సెప్టెంబర్ 14న నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎం.ఎస్. నంబర్ 571 రెవెన్యూ (అస్సైన్-1) డిపార్ట్మెంట్ ప్రకారం భూకేటాయింపులకు సంబంధించిన కొత్త విధానం ఆధారంగా 400 ఎకరాల ప్రభుత్వ భూమిని కొలిచి హక్కులు బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐ అండ్ సీ విభాగం 19 జూన్ 2024న సూచించింది. అదే రోజున ఐటీ, ఇతర ప్రాజెక్టుల ఏర్పాటుకు తమకు భూమిని కేటాయించాలని టీజీఐఐసీ ప్రతిపాదనలు సమర్పించగా 400 ఎకరాల ప్రభుత్వ భూమి హక్కులను టీజీ ఐఐసీకి బదిలీ చేస్తూ 24 జూన్ 2024న ప్రభుత్వ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేయగా 1 జూలై 2024న రెవెన్యూ అధికారులు పంచనామా నిర్వహించి టీజీ ఐఐసీకి అప్పగించారు. అప్పటి నుంచి ఆ భూమి ప్రభుత్వ స్వాధీనంలోనే ఉందని ప్రభుత్వం పేర్కొన్నది. తమకు కేటాయించిన సదరు భూమికి సంబంధించిన ఉమ్మడి సరిహద్దుల గుర్తింపు హెచ్‌సీయూ అధికారుల సమన్వయంతోనే 19 జూలై 2024 జరిగిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అక్కడ చేసిన సర్వేను పరిశీలించిన టీజీఐఐసీ (TG IIC) ఆ 400 ఎకరాల భూమిని మాస్టర్ ప్లాన్ ప్రకారం సాధ్యమైనంత ఎక్కువ వినియోగించుకునేందుకు 2025 ఫిబ్రవరి 28న ఆర్ఎఫ్ పీ(రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్) జారీ చేసిందని తెలిపింది.

Read More..

Maoist party letter: హెచ్ సీయూ, ఓయూలో రగడ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై మావోయిస్టు పార్టీ సంచలన లేఖ

Next Story