తెలంగాణ మహిళా రైతులకు గుడ్‌న్యూస్

by Gantepaka Srikanth |

రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం క్రీడా ప్రాంగణంలో రెండు రోజుల పాటు జరగనున్న 'మెగా రైతుమేళా' ఆదివారం ప్రారంభమైంది.

తెలంగాణ మహిళా రైతులకు గుడ్‌న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం క్రీడా ప్రాంగణంలో రెండు రోజుల పాటు జరగనున్న 'మెగా రైతుమేళా' ఆదివారం ప్రారంభమైంది. పీజేటీఏయూ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, రాష్ట్ర వ్యవసాయశాఖలు సంయుక్తంగా ఈ మేళాని నిర్వహిస్తున్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, 2026ని అంతర్జాతీయ 'మహిళా రైతు సంవత్సరం'గా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన నేపథ్యంలో ఈ మేళాని ఏర్పాటు చేశారు. రాష్ట్రం నలుమూలనుంచి పెద్ద సంఖ్యలో రైతులు, మహిళా రైతులు, వ్యవసాయరంగ నిపుణులు, విద్యార్థులు ఈ మేళాకి హాజరు అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం వ్యవసాయం, రైతాంగ సంక్షేమమే ఊపిరిగా నిరంతరం పని చేస్తోందని వ్యవసాయశాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రపంచంలోనే తెలంగాణా రైతుని తలెత్తుకుని నిలబడేలా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.

పథకాల్ని పునరుద్ధరించి ప్రారంభిస్తున్నాం..

దేశంలో ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తర్వాత తమ నేత రాహూల్ గాంధీ ఆలోచనకి అనుగుణంగా సుమారు 25 లక్షల మందికి సుమారు 21 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసామని మంత్రి అన్నారు. గత ప్రభుత్వంలో ఆగిపోయిన రాయితీ విత్తనాలు, వ్యవసాయ యాంత్రీకరణ వంటి పథకాల్ని పునరుద్ధరించి ప్రారంభిస్తున్నామని ఆయన వివరించారు. 500 కోట్ల రూపాయలతో పునరుద్దరించిన వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో మహిళా రైతులకే పెద్దపీట వేస్తున్నామన్నారు. భవిష్యత్తులో మహిళలకే డ్రోన్‌లు అందిస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. పంటమార్పిడి, సహజ వ్యవసాయ విధానాలని విరివిగా ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రతి జిల్లాలో ఆయిల్ పాం పరిశ్రమని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం రాగానే మూడు కొత్త వ్యవసాయ కళాశాలలు ఏర్పాటు చేసామని తెలిపారు. అధునాతన నైపుణ్యాలు,టెక్నాలజీలని ఉపయోగించుకొని ప్రజల అవసరాలకి సరిపడా అహారధాన్యాలని రైతులు పండించాలని రాష్ట్ర ఐ.టీ, పరిశ్రమలశాఖా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. మెగా రైతు మేళా నిర్వహిస్తున్నందుకు జయశంకర్ యూనివర్సిటీని రాష్త్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖా మంత్రి సీతక్క అభినందించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ గోపి, ఉద్యాన శాఖ సంచాలకులు యాస్మీన్ బాషా, శాసనమండలి విప్ పట్నం మహేందర్ రెడ్డి, రాజేంద్రనగర్ శాసన సభ్యులు టి. ప్రకాష్ గౌడ్, కోరమాండల్ ఎం. డి. శంకర సుబ్రహ్మణ్యం, ఐకార్ సంస్థల అధికారులు పాల్గొన్నారు.

Next Story