85 శాతం మెడికల్ పీజీ సీట్ల జీవో విడుదల

by Muthe.Rajitha |

ప్రైవేట్, మైనారిటీ మెడికల్ కళాశాలలలో పీజీ మేనేజ్‌మెంట్ కోటా సీట్లలో తెలంగాణ విద్యార్థులకు పెద్ద పీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

85 శాతం మెడికల్ పీజీ సీట్ల జీవో విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రైవేట్, మైనారిటీ మెడికల్ కళాశాలలలో పీజీ మేనేజ్‌మెంట్ కోటా సీట్లలో తెలంగాణ విద్యార్థులకు పెద్ద పీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ సోమవారం జీవో జారీ చేసింది. ఈ జీవో ఎంఎస్ నెం. 201 ప్రకారం ప్రైవేట్, మైనారిటీ మెడికల్ కళాశాలలలో పీజీ కోర్సులలో మేనేజ్‌మెంట్ కోటా (సబ్-కేటగిరీ–1) సీట్లలో 85శాతం సీట్లను తెలంగాణ రాష్ట్ర స్థానికులకు కేటాయించనున్నారు.

ఇక మిగిలిన 15శాతం సీట్లు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు “ఆల్‌ ఇండియా కోటా” కింద ఇవ్వబడతాయి. ఇప్పటివరకు ఈ సీట్లన్నీ కూడా పూర్తిగా జాతీయ స్థాయిలోనే భర్తీ చేస్తూ వచ్చారు. ఫలితంగా గత పదేళ్లుగా తెలంగాణ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వచ్చిన రెండో ఏడాదే స్థానిక విద్యార్థుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మార్పు చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది.

కాగా... స్థానిక విద్యార్థులు సీట్లు కోల్పోతున్న అంశంపై దిశ గత నెల 6వ తేదీన "85శాతం సీట్లు మనకే దక్కాలి" పేరిట కథనం ప్రచురించింది. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక కోటా ఉన్నప్పుడు మన వద్ద ఎందుకు తీసుకురావడం లేదంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయింది. జీవో సవరించకపోవడంతో సుమారు 382 పీజీ సీట్లను మన రాష్ట్ర విద్యార్థులు కోల్పోతున్న తీరును ప్రభుత్వం దృష్టికి దిశ తీసుకుపోవడంతో పాటు వెంటనే సర్కారు స్పందించి లోకల్ విద్యార్థులకు న్యాయం చేయాలని సూచించింది. మరోవైపు ఈ అంశంపై అనేక మార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ వచ్చిన టీ జూడా సైతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసింది.

Next Story