వచ్చే నెలలో గ్లోబల్ ఏఐ సమ్మిట్.. మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు

by Geesa Chandu |   (  Updated:2024-08-27 15:32:58  IST  )

సెప్టెంబర్ 5, 6 తేదీల్లో గ్లోబల్ ఏఐ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

వచ్చే నెలలో గ్లోబల్ ఏఐ సమ్మిట్.. మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సెప్టెంబర్ 5, 6 తేదీల్లో గ్లోబల్ ఏఐ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ లోని ఓ హోటల్ లో మంగళవారం హైద‌రాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంట‌ర్‌ప్రైజెస్ అసోసియేష‌న్ (హైసియా) ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ "హైద‌రాబాద్ న‌గ‌రాన్ని ప్రపంచ ఏఐ రాజ‌ధానిగా నిల‌బెట్టే ల‌క్ష్యంతో ఈ స‌ద‌స్సు నిర్వహిస్తున్నామన్నారు. సమ్మిళిత పరిష్కారాలను సృష్టించడానికి ఏఐ అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. గణనీయమైన సానుకూల సామాజిక ప్రభావాన్ని నడిపించడానికి పరిశ్రమ నాయకులు, విధానకర్తలు, ఆవిష్కర్తల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ లక్ష్యాలను సాధించేందుకు తెలంగాణ సర్వసన్నద్ధంగా ఉందని వెల్లడించారు. ఏఐని ఉపయోగించుకుంటున్నప్పుడు, అది నిష్పాక్షికత, పారదర్శకత, జవాబుదారీతనంతో మానవాళికి సేవలందించేలా చూడాలన్నారు. త్వర‌లో ఏర్పాటుచేయ‌బోయే నైపుణ్య విశ్వవిద్యాలయం, ప్రతిష్ఠాత్మక ఏఐ సిటీ లాంటి కార్యక్రమాలకు ఐటీ పరిశ్రమ కూడా సహకరించాలి" అని మంత్రి కోరారు.

హైసియా అధ్యక్షుడు ప్రశాంత్ నాదెళ్ల మాట్లాడుతూ.. "కృత్రిమ మేధ నైపుణ్యాలతో పరిశ్రమకు సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తిని సృష్టించడంపై దృష్టి సారించి, శిఖరాగ్ర సమావేశానికి మద్దతు ఇవ్వడానికి హైసియా నిబద్ధతతో ఉందన్నారు. టాస్క్, టీ-హబ్, టీఎస్ఐసీ, ఇతర కీలక ప్రభుత్వ సంస్థల సహకారంతో ఏఐ లేదా జీఎన్ఏఐలో 10,000 మందికి పైగా విద్యార్థులను నైపుణ్యాలను పెంచాలని యోచిస్తున్నట్లు" తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఐటీ స‌ల‌హాదారు సాయికృష్ణణ్, ఐటీఈ అండ్ ఈ శాఖ సీఆర్వో అమ‌ర్‌నాథ్ రెడ్డి, ఎమ‌ర్జింగ్ టెక్నాల‌జీస్‌, ర‌మాదేవి, శ్రీ‌నివాస‌రావు, శ్రీ‌కాంత్ సిన్హా, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

Next Story