‘సమాజంలో మహిళలపై వివక్ష’

by Disha Web Desk 4 |
‘సమాజంలో మహిళలపై వివక్ష’
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘దిశ’ పత్రికలో మహిళలకు వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఎంతో బాగుందని ఫీచర్స్ ఇన్ చార్జి సుజిత అన్నారు. ఇతర సంస్థల్లో కనిపించని ప్రజాస్వామిక వాతావరణం, సంతృప్తికరమైన పని చేసే వాతావరణం ఇక్కడ చూస్తున్నామన్నారు. సిబ్బంది సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు. ‘దిశ’ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో సుజిత మాట్లాడారు.

‘దిశ’లో పనిచేస్తున్న మహిళా సిబ్బంది ఇప్పటివరకూ వివిధ మీడియా సంస్థల్లో చూసిన అనుభవాలను ‘దిశ’తో పోల్చి సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రోత్సాహంతో పాటు అవకాశాలు కల్పించి ఉన్నత స్థానాలకు డెవలప్ చేయడంలో సంస్థ నుంచి అందుతున్న సహకారంపై సంతోషం వ్యక్తం చేశారు. టెక్నాలజీని నిత్య జీవితంలో వినియోగిస్తున్నా గ్రామీణ మహిళలకు మాత్రం ఇప్పటికీ స్మార్ట్ ఫోన్ ఒక అందని ద్రాక్షగానే ఉన్నదన్నారు. అది వాడే ఆడపిల్లలపై ఉద్దేశపూర్వకంగానే ముద్ర వేస్తున్నారని, స్వగ్రామంలో బంధువుల ఇంట్లోని ఘటనను ఉదహరించారు.

ఎడిటర్ మార్కండేయ మాట్లాడుతూ పురుషాధిక్య సమాజంలో జీవిస్తున్నందున కేవలం పురుషులలో మాత్రమే కాక మహిళల్లోనూ ఈ భావజాలం నాటుకుపోయిందన్నారు. గుర్తించినా దాన్ని పూర్తిగా వదిలించుకోడానికి రకరకాల కారణాలు తోడవుతున్నాయ న్నారు. భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తూ సమాన స్థాయిలో జీతాలు ఆర్జిస్తున్న కుటుంబాల్లో వివక్ష స్వల్పంగా ఉంటున్నదని కొన్ని ఉదాహరణల ద్వారా వివరించారు. ఆర్థిక సమానత్వం ఉన్న సమాజంలో పురుషాధిక్య భావజాలం తీవ్రత తక్కువగా ఉంటుందని, మిగిలిన పరిస్థితులతో పోలిస్తే ఒక మేరకు ప్రజాస్వామిక విలువలు మెరుగ్గా ఉంటుందని వివరించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఉమెన్ స్టాఫ్ కేక్ కట్ చేసి వారివారి అభిప్రాయాలను సిబ్బందితో షేర్ చేసుకున్నారు.


Next Story

Most Viewed