ఆటోలకు ఊరట : మళ్లీ తెరుచుకున్న ఎల్పీజీ బంకులు.. స్టీఫెన్ ​రవీంద్ర

by Ramesh Naini |

తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ సరఫరాను పెంచి మూతపడిన బంకులను మళ్లీ తెరిపించడంలో సూపర్ గ్యాస్, గో గ్యాస్, టోటల్ ఎనర్జీస్, ప్రైమ్ ఫ్యూయల్ కంపెనీలు చేసిన కృషిని రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ ​రవీంద్ర అభినందించారు.

ఆటోలకు ఊరట : మళ్లీ తెరుచుకున్న ఎల్పీజీ బంకులు.. స్టీఫెన్ ​రవీంద్ర
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ సరఫరాను పెంచి మూతపడిన బంకులను మళ్లీ తెరిపించడంలో సూపర్ గ్యాస్, గో గ్యాస్, టోటల్ ఎనర్జీస్, ప్రైమ్ ఫ్యూయల్ కంపెనీలు చేసిన కృషిని రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ ​రవీంద్ర అభినందించారు. గత ఇచ్చిన ఆదేశాలను మరికొన్ని కంపెనీలు మాత్రం పెద్దగా పనితీరు చూపించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆటో ఎల్పీజీని ఎక్కువగా తెప్పించి, తమ బంకులన్నింటిలో ఎక్కడా ఆగకుండా సరఫరా చేయాలని ఆ కంపెనీలకు సూచించారు. మంగళవారం తమ కార్యాలయంలో ఆటో ఎల్పీజీ సరఫరా చేసే కంపెనీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ల ఉపాధి దెబ్బతినకుండా ఉండాలంటే ఆటో ఎల్పీజీ సరఫరా ఆగకుండా చూడటం చాలా ముఖ్యమని వారికి గుర్తుచేశారు.

ఈ విషయంలో కంపెనీలన్నీ బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు. తమ శాఖ ఇక నుంచి ఈ పరిస్థితిని నిరంతరం గమనిస్తూనే ఉంటుంది. ప్రజల ప్రయాణాలకు ఇబ్బంది కలగకుండా, గ్యాస్ సరఫరాను ఇదే విధంగా కొనసాగిస్తూ ఇంకా పెంచాలని కంపెనీలను కోరారు. హైదరాబాద్‌లో ఆటో గ్యాస్ కొరత రాకుండా చూసేందుకు, సివిల్ సప్లైస్ శాఖ ప్రతిరోజూ పనిచేస్తున్న బంకులను, గ్యాస్ సిలిండర్ల పంపిణీ లెక్కలను పర్యవేక్షిస్తుందన్నారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో కలిసి పనిచేస్తూ అంతర్జాతీయ స్థాయిలో ఉన్న గ్యాస్ సరఫరా కొరత ప్రభావం హైదరాబాద్‌పై పడకుండా పౌరసరఫరాల శాఖ చూసుకుంటుందన్నారు.

Next Story