రాష్ట్రంలో ఫాక్స్ కాన్ భారీ పెట్టుబడి.. కేసీఆర్‌తో చైర్మన్ యంగ్ ల్యూ సుధీర్ఘ చర్చ

by Disha Web Desk 13 |
రాష్ట్రంలో ఫాక్స్ కాన్ భారీ పెట్టుబడి.. కేసీఆర్‌తో చైర్మన్ యంగ్ ల్యూ సుధీర్ఘ చర్చ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పెట్టుబడులకు ‘హోన్ హై ఫాక్స్ కాన్ ’ సంస్థ ముందుకు వచ్చింది. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు పెట్టనుంది. సంస్థ చైర్మన్ యంగ్ ల్యూ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సీఎం కేసీఆర్ ను ప్రగతి భవన్ లో గురువారం సమావేశమయ్యారు. పెట్టబడులపై సుధీర్ఘంగా చర్చించారు. ఫాక్స్ కాన్ సంస్థ భవిష్యత్తు విస్తరణ ప్రణాళికల పైన కూలంకషంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఫాక్స్ కాన్ కంపెనీ పెట్టుబడులకు ఒప్పందం కుదిరింది.

ఈ ఒప్పందంతో యువతకు లక్ష ఉద్యోగాలు కల్పించనున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి లభించనుంది. ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశంలోకి వచ్చిన అతిపెద్ద పెట్టుబడుల్లో ఇది ముఖ్యమైనది. యంగ్ ల్యూ పుట్టిన రోజు కావడంతో స్వదస్తూరితో ప్రత్యేకంగా తయారు చేయించిన గ్రీటింగ్ కార్డును కేసీఆర్ స్వయంగా అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

కేసీఆర్ మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా అనేక దేశాల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగ ముఖ చిత్రాన్ని మార్చిన ‘హోన్ హై ఫాక్స్ కాన్ ’ తమ ఉత్పత్తి కార్యకలాపాలకు తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకోవడంపై ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో సంస్థకు అన్ని రకాల సహాయ, సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. స్వరాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించి భారీగా పెట్టుబడును రప్పించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విజయవంతమైందన్నారు.

ఈ లక్ష ఉద్యోగాలను సాధ్యమైనంతవరకు స్థానిక తెలంగాణ యువతకు దక్కేలా చర్యలు చేపడుతామన్నారు. తెలంగాణను అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణను అమలు చేస్తున్నదని, బంగారు తెలంగాణ సాధన కోసం ప్రభుత్వం అనేక ప్రాజెక్టులను చేపట్టిందన్నారు. ఫాక్స్ కాన్ సంస్థ యూనిట్ ను రాష్ట్రంలో నెలకొల్పడం పారిశ్రామికాభివృద్ధికి దోహదపడుతుందన్నారు. తైవాన్‌ను తెలంగాణ సహజ భాగస్వామిగా భావిస్తున్నామన్నారు.

ఫాక్స్ కాన్ పురోగమనంలో తెలంగాణ రాష్ట్రం భాగమైనందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సంస్థ చైర్మన్ యంగ్ ల్యూ మాట్లాడుతూ.. తెలంగాణలో పారిశ్రామిక అనుకూల వాతావరణం ఉందన్నారు. ఎనిమిదేళ్లలో తెలంగాణ పారిశ్రామిక రంగంలో, ఐటీ, అనుబంధ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో సాధించిన అభివృద్ధి పై హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో తమ సంస్థ పెట్టుబడుల విషయంలో ఆశావాహ దృక్పథంతో ఉన్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు రామకృష్ణారావు, అరవింద్ కుమార్, పరిశ్రమల శాఖ అదనపు కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి, డైరక్టర్ ఎలక్ట్రానిక్స్ సుజయ్ కారంపురి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed