తప్పంతా మీదే.. కేంద్రం సహకరిస్తున్నా ప్రయోజనం లేదు

by Disha Web Desk 12 |
తప్పంతా మీదే.. కేంద్రం సహకరిస్తున్నా ప్రయోజనం లేదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: జాతీయ రహదారుల అథారిటీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ (ఫ్లైఓవర్) అనుకున్న షెడ్యూల్ ప్రకారం పూర్తి కాకపోవడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని ఇటీవల రాష్ట్ర మంత్రి కేటీఆర్ రాసిన లేఖ సెంటర్-స్టేట్ ఫైట్‌గా మారింది. కేంద్ర, రాష్ట్ర మంత్రుల మధ్య మాత్రమే కాక బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య కూడా ట్విట్టర్ వార్‌కు దారితీసింది.

అయితే ఈ విషయంపై మార్చి 14నే ఎన్ హెచ్ అథారిటీ రీజినల్ ఆఫీసర్ ఎస్కే కుశ్వాహ రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు కు లేఖ రాశారు. ఆర్ అండ్ బీ కింద ఉన్న సబార్డినేట్ ఆఫీసులు, అధికారుల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం కారణంగానే రాష్ట్రంలోని నాలుగు నేషనల్ హైవే ప్రాజెక్టుల పనులకు ఆటంకం కలుగుతుందని పేర్కొన్నారు. అధికారులు, ఆఫీసుల మధ్య నెలకొన్న కుమ్ములాటలకు జాతీయ రహదారుల నిర్మాణం వేదిక కావొద్దని సూచించారు.

కేంద్రం సహకరిస్తున్నా..

కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నదని ఆ లేఖలో కుశ్వాహా పేర్కొన్నారు. పనులను చేయించే, పర్యవేక్షించే ఆర్ అండ్ బీ, నేషనల్ హైవే విభాగాలకు చెందిన కార్యాలయాలు, అధికారులు వారిలో వారు కొట్టుకుంటున్నారని వెల్లడించారు. సుమారు రూ. 2,268 కోట్ల ఖర్చుతో నిర్మించాలనుకున్న నాలుగు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారని, కేంద్ర మంత్రి ప్రత్యేక చొరవ తీసుకున్నారని, అయినా రాష్ట్ర అధికారుల మధ్య నెలకొన్న విభేదాలు చివరకు ఈ ప్రాజెక్టులకు ఆటంకం కలిగిస్తున్నాయని వివరించారు. ఇప్పటికైనా ఆ అధికారులు, ఆఫీసుల మధ్య ఘర్షణ వాతావరణాన్ని నివారించడానికి ఆ శాఖ కార్యదర్శిగా చొరవ తీసుకోవాలని కుశ్వాహ కోరారు.


Next Story

Most Viewed