ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.. మంత్రి కేటీఆర్‌కు లేఖ

by Disha Web Desk 2 |
ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.. మంత్రి కేటీఆర్‌కు లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ పాలనను వికేంద్రీకరించి పారదర్శకతకు పెద్దపీట వేయడానికి ప్రతి వార్డులో వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్‌కు గురువారం లేఖ రాశారు. వార్డు కార్యాలయాల్లో పదిమంది సంబంధిత శాఖల అధికారులు ఉంటారని మంత్రి పేర్కొన్నారన్నారు. ప్రతి మున్సిపల్ వార్డులో స్థానికులతో వార్డు కమిటీలు నియమించాలని భారత రాజ్యాంగ అనుకరణ 243 నిర్దేశిస్తుందన్నారు. ఇక జీహెచ్ఎంసీ చట్టం 8ఏ ప్రకారం, 8బీ ప్రకారం ప్రతి వార్డులో స్థానికులు, మహిళలు, నిష్ణాతులు రెసిడెంట్ వెల్పేర్ అసోసియేషన్ సభ్యులతో వార్డు కమిటీ వేయాలన్నారు.

ఇప్పటికే సిబ్బంది కొరత కార్పొరేషన్లలో ఉందని, ఆ పరిస్థితుల్లో వార్డుకు పది మంది చొప్పున 150 వార్డులకు 1500 సిబ్బంది, 150 మంది అధికారులు ఎక్కడి నుంచి వస్తారన్నారు. అధికారులతో వార్డుపాలన కాదని సాధ్యం కాదన్నారు. రాష్ట్రంలో 129 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లలో ఎన్నికలు కాగానే వార్డు కమిటీలు వేశారని, కానీ జీహెచ్ఎంసీకే వార్డు కమిటీలు వద్దనుకోవడం సమంజసం కాదన్నారు. ఇప్పటికైనా అధికారులతో నడిచే ప్రస్తుత వార్డు కార్యాలయాల స్థాపనను నిలిపివేసి వాటి స్థానాన్నే వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలని స్వచ్ఛంద సేవా సంస్థలు సైతం కోరుతున్నాయన్నారు.



Next Story

Most Viewed