పెండింగ్‌లో 12 వేల అప్పీళ్లు.. సీఎస్‌కు ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ

by Disha Web Desk 19 |
పెండింగ్‌లో 12 వేల అప్పీళ్లు.. సీఎస్‌కు ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్‌ను నియమించాలని ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం. పద్మనాభరెడ్డి కోరారు. శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి సహచట్టం కమిషనర్ల నియామకంపై లేఖ రాశారు. రాష్ట్రంలో గత ఆరునెలలుగా సమాచార కమిషనర్లు లేక కమిషన్ ఎలాంటి పనిచేయలేకపోతుందన్నారు. ప్రస్తుతం 12వేలకు పైచిలుకు అప్పీళ్లు కమిషన్‌లో పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

సమాచార కమిషనర్ల నియామకంపై ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వం కమిషనర్ల నియామకానికి చర్యలు తీసుకుందని, ఈ నెల 12న దరఖాస్తు గడువు ముగిసిందని, మొత్తం 281 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వారం రోజులు గడిచినా నియామక ప్రక్రియ ముందుకు సాగడం లేదని, పెండింగ్‌లో ఉన్న అప్పీళ్లను దృష్టిలో ఉంచుకొని 10 మంది కమిషనర్ల నియామకం చేపట్టాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నందున సత్వరం చర్యలు చేపట్టాలని సీఎస్‌కు విజ్ఞప్తి చేశారు.

Next Story

Most Viewed