బిగ్ న్యూస్: తెలంగాణ రాజకీయాల్లోకి మళ్లీ TRS ఎంట్రీ.. మాజీ MP సంచలన నిర్ణయం..?!

by Disha Web Desk |
బిగ్ న్యూస్: తెలంగాణ రాజకీయాల్లోకి మళ్లీ TRS ఎంట్రీ.. మాజీ MP సంచలన నిర్ణయం..?!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో పొలిటికల్ గేమ్ మారుతోంది. అధికార బీఆర్ఎస్‌ను ఢీ కొట్టేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు వేగం పెంచాయి. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండేలా కార్యక్రమాలకు కసరత్తు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే కేసీఆర్ టార్గెట్‌గా రాష్ట్ర రాజకీయ చదరంగంలోకి మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోబోతోందనే టాక్ తాజా రాజకీయాలను మరింత హీటెక్కిస్తోంది.

కేసీఆర్‌పై అసంతృప్తితో ఉన్న పలువురు ఇప్పటికే రాజకీయంగా తమ ప్రయత్నాలు కొనసాగిస్తుండగా.. తాజాగా మరో కీలక నేత గులాబీ బాస్‌కు షాకిచ్చే వ్యూహంతో కొత్త పార్టీని ప్రారంభించాలని ప్రణాళిక చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. టీఆర్ఎస్‌ను వదిలేసి కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో పాలిటిక్స్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్న వేళ ఇన్నాళ్లు కేసీఆర్‌కు కలిసి వచ్చిన టీఆర్ఎస్ పేరు వచ్చేలా తెలంగాణ రైతు సమితి పేరుతో ఝలక్ ఇచ్చేలా ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పావులు కదుపుతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ప్లాన్ మార్చిన పొంగులేటి?:

గత కొంత కాలంగా బీఆర్ఎస్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పొంగులేటిపై గులాబీ నేతలు అంతే స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. పొంగులేటి పదవులు అన్ని అనుభవించి పార్టీకి ద్రోహం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. దీంతో బీఆర్ఎస్ నేతల మాటలకు పొంగులేటి సైతం కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్‌తో చెడిన పొంగులేటి.. కారు దిగి కమలం పార్టీకి చేరుతారనే టాక్ వినిపించింది. కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు కూడా లేకపోలేదనే చర్చ జరుగుతోంది. దీనికి తోడు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల, విజయమ్మ చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి.

పొంగులేటి తమ పార్టీలో చేరుతానని మాట ఇచ్చారని ఆ మాటకు కట్టుబడే ఉంటారని భావిస్తున్నట్లు షర్మిల చేసిన కామెంట్స్ సెన్సేషనల్‌గా మారాయి. అయితే ఈ వ్యాఖ్యలను మొదట్లో ఖండించిన పొంగులేటి ఆ తర్వాత పెద్దగా పట్టించుకోలేదు. దాంతో పొంగులేటి రాజకీయ నిర్ణయంపై రకరకాల వాదనలు తెరపైకి వస్తునే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పొంగులేటి తన ప్లాన్ మార్చుకుని ఇతర పార్టీలో చేరడం కంటే తానే సొంత వేదిక ఎందుకు ఏర్పాటు చేసుకోవద్దనే దిశగా ఆలోచన చేస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఆ జిల్లాలే టార్గెట్..?

పొంగులేటికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంచి పట్టు ఉంది. గత ఎన్నికల్లో ఈ జిల్లాలో బీఆర్ఎస్‌కు ఎదురుగాలి వీచింది. ప్రస్తుతం ఇతర పార్టీల నేతల చేరికలతో ఓవర్ లోడ్ అయింది. దీంతో ఈ జిల్లా నేతల తీరు గులాబీ బాస్‌కు తలనొప్పి వ్యవహారంగా మారింది.ఈ క్రమంలో తనకు పట్టున్న ఉమ్మడి ఖమ్మంతో పాటు వరంగల్, నల్లగొండ జిల్లాల్లో 25 సీట్లపై ప్రధానంగా దృష్టి సారించేలా పొంగులేటి పక్కా స్కెచ్ వేసుకుంటున్నారని తెలుస్తోంది.

ఈ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పని చేసి తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని పొంగులేటి చూస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం పొంగులేటి సొంత వేదికనే ఏర్పాటు చేసుకుంటారా? లేక మరేదైనా పార్టీ తీర్థం పుచ్చుకుంటారా? అనేది ఆయనే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Next Story

Most Viewed