ఒక్క హత్యతో కాంగ్రెస్ దాహం తీరేలా లేదు: మాజీ ఎమ్మెల్యే గువ్వల ఫైర్

by Disha Web Desk 19 |
ఒక్క హత్యతో కాంగ్రెస్ దాహం తీరేలా లేదు: మాజీ ఎమ్మెల్యే గువ్వల ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలకు తెర తీసిందని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. మాజీ సైనికుడు హత్యకు గురైతే స్థానిక ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని మంత్రి జూపల్లి కృష్ణారావుపై ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ బీఆర్ఎస్ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, కాంగ్రెస్ దాహం ఒక హత్యతో తీరేలా కనిపించడం లేదని విమర్శించారు.

మంత్రిగా జూపల్లి హత్యా రాజకీయాలను నియంత్రించాలని అని మాత్రమే కేటీఆర్ అన్నారు తప్పా.. ఎలాంటి ఆరోపణలు చేయలేదని స్పష్టం చేశారు. పండుగలకు ఏర్పాట్లు చేసిన ఫ్లెక్సీలను సైతం కాంగ్రెస్ నాయకులు చించివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయన్నారు. ఫోన్లలో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జూపల్లి ఎక్కడెక్కడో జరిగిన సంఘటనలను ప్రస్తావిస్తూ అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

గతంలో కేసీఆర్ హయాంలో ఐదేళ్ల పాటు మంత్రిగా పనిచేసిన జూపల్లి లేనిపోని అంశాలను తెరపైకి తీసుకొస్తున్నారని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వెనకేసుకురావడం సబబు కాదని హితవు పలికారు. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ సైనికుడి హత్యపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. హత్య వెనుక ప్రభుత్వానికి చెందిన నేతల హస్తం ఉండటంతోనే ఆపార్టీ నేతలు పరామర్శించలేదని మండిపడ్డారు. న్యాయం జరిగేవరకు ఆ కుటుంబానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. సమావేశంలో నాయకులు శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, పాల్గొన్నారు.



Next Story

Most Viewed