Talasani Srinivas Yadav: శిలాఫలకాలపై ఓడిపోయిన నాయకుల పేర్లు ఎందుకు?

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు లేక చిన్నచిన్న పనులకు సైతం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉన్నదని.. నియోజకవర్గ అభివృద్ధి నిధులు విడుదల చేయాలని మాజీమంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్‌యాదవ్ కోరారు.

Talasani Srinivas Yadav: శిలాఫలకాలపై ఓడిపోయిన నాయకుల పేర్లు ఎందుకు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు లేక చిన్నచిన్న పనులకు సైతం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉన్నదని.. నియోజకవర్గ అభివృద్ధి నిధులు విడుదల చేయాలని మాజీమంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్‌యాదవ్ కోరారు. మంగళవారం అసెంబ్లీలో క్వశ్చర్ అవర్‌లో మాట్లాడారు. హైదరాబాద్ అందమైన నగరమని.. కాలక్రమేణా వచ్చిన ప్రభుత్వాలు అభివృద్ధి పనులు చేపట్టాయని.. దేశంలోని అనేక ప్రాంతాలకు చెందిన వారు స్థిరపడ్డారని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ ఆధ్వర్యంలో ఫ్లై ఓవర్లు, ఆర్‌యూబీలు, అండర్ పాస్‌లు, స్కై వాక్‌లను నిర్మించామని.. పదేళ్లలో రూ.63 వేల కోట్లతో రహదారులు, డ్రైనేజీ, స్ట్రామ్ వాటర్ లైన్, వంటి అభివృద్ధి పనులు ప్రణాళికాబద్ధంగా చేశామని వెల్లడించారు. కానీ, ఈ 28 నెలల్లో వర్షాలతో రోడ్లు కొట్టుకుపోతే మరమ్మతులు లేవని ఆరోపించారు. ఎమ్మెల్యేలకు నిధులు ఇస్తే నియోజకవర్గాలలో అభివృద్ధి పనులు చేసేవారమని తెలిపారు. కార్పొరేటర్ల పదవీ కాలం ముగింపు సమయంలో ఒక్కో కార్పొరేటర్‌కు రూ.2 కోట్లు అభివృద్ధి పనులకు ఇస్తామన్న నిధులు ఇంతవరకు ఇవ్వలేదన్నారు. తాము చేసిన అభివృద్ధి పనులకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రారంభోత్సవాలు చేస్తున్నారని.. ప్రొటోకాల్ పాటించడం లేదని చెప్పారు. అధికారిక శిలాఫలకాలపై ఓడిపోయిన నాయకుల పేర్లు ఎలా పెడతారని ప్రశ్నించారు.

Next Story