‘ఓ స్త్రీ రేపు రా కథ చెబుతున్నారు’.. కాంగ్రెస్‌ సర్కార్‌పై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్

by Satheesh |
‘ఓ స్త్రీ రేపు రా కథ చెబుతున్నారు’.. కాంగ్రెస్‌ సర్కార్‌పై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైతుకు ‘భరోసా’ ఉన్నట్లా.. లేనట్లా..? ఎన్నికల ప్రచారం మీద ఉన్న సోయి విధి, విధానాల రూపకల్పన మీద ఉండదా..? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ వానాకాలం నుండి రైతుభరోసా పథకం కింద ఎకరాకు రూ.7500 పథకం అమలు చేయాలని బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఏడు నెలల నుండి రైతు భరోసాపై ముఖ్యమంత్రి, మంత్రులకు సమీక్షించే తీరిక లేదా..? అని నిలదీశారు. ఏ పథకం గురించి అడిగినా ముఖ్యమంత్రి, మంత్రులు దెయ్యానికి భయపడి వెనకటికి గోడల మీద ‘ఓ స్త్రీ రేపురా’ అని రాసి ఉండే కథను వినిపిస్తున్నారని విమర్శించారు.

గతేడాది డిసెంబరు 9న రూ.15 వేల రైతు భరోసా అన్న ముఖ్యమంత్రి హామీలు నీటి మీది రాతలే అని తేలిపోయిందన్నారు. ఇప్పుడు రైతుభరోసాకు విధి, విధానాలు, ఎన్ని ఎకరాలకు పరిమితం చేయాలని మల్లగుల్లాలు పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఎందుకు రైతుభరోసాను పరిమితం చేస్తామని, సమీక్ష చేస్తామని చెప్పలేదు అని ప్రశ్నించారు. రైతుభరోసాకు దిక్కు లేదు.. కౌలు రైతుల ఊసులేదు.. రైతు కూలీల గురించి పట్టించుకున్న నాథుడు లేడన్నారు. వరికి రూ.500 బోనస్ వట్టి బోగస్ అని తేలిపోయిందన్నారు.

ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే రైతుభరోసాను 5 ఎకరాలకో, 10 ఎకరాలకో పరిమితం చేస్తామని విధాన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కేవలం కాలయాపన కోసమే శాసనసభ సమావేశాలు అంటూ ఊదరగొడుతున్నదన్నారు. ప్రభుత్వానికి ఇచ్చే చిత్తశుద్ధి ఉంటే వెంటనే క్యాబినెట్ భేటీ ఏర్పాటు చేసి రైతుభరోసాపై తీర్మానం చేయాలన్నారు. రైతుబీమా ఉంచుతారా..? ఎత్తేస్తారా..? తేల్చిచెప్పాలని, రైతుకూలీలకు రూ.12వేలు, కౌలు రైతులకు రూ.15వేలు ఇవ్వడంపై స్పష్టతనివ్వాలన్నారు. అబద్దపు హామీలతో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ రాష్ట్ర రైతాంగాన్ని నిలువునా ముంచుతున్నదని, ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story