KTR: ప్రధాని మోడీ తలుచుకుంటే అది పెద్ద విషయం కాదు.. కానీ..

by Gantepaka Srikanth |

సీసీఐ ఫ్యాక్టరీ(CCI Factory)ని తిరిగి ప్రారంభించాలని ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న నిరసనలు, వారి ఆర్థనాదాలు కేంద్ర ప్రభుత్వానికి వినిపించడం లేదా? అని కేటీఆర్(KTR) ప్రశ్నించారు.

KTR: ప్రధాని మోడీ తలుచుకుంటే అది పెద్ద విషయం కాదు.. కానీ..
X

దిశ, వెబ్‌డెస్క్: సీసీఐ ఫ్యాక్టరీ(CCI Factory)ని తిరిగి ప్రారంభించాలని ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న నిరసనలు, వారి ఆర్థనాదాలు కేంద్ర ప్రభుత్వానికి వినిపించడం లేదా? అని కేటీఆర్(KTR) ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. సీసీఐకి చెందిన ఎంతో విలువైన యంత్ర పరికరాలను పాత ఇనుప సామాన్ల కింద లెక్క కట్టి ఆన్‌లైన్‌లో అమ్మడానికి టెండర్లు పిలవడం బీజేపీ ప్రభుత్వ(BJP Govt) దగుల్భాజీ తనానికి నిదర్శనం అన్నారు. నిర్మాణ రంగంలో సిమెంట్‌కు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని సీసీఐని పునఃప్రారంభించి కార్మికులను ఆదుకోవాలని పదుల సార్లు కేంద్ర మంత్రులను తమ ప్రభుత్వం కోరినా, కనీసం వారు కనికరించకపోవడం ఆదిలాబాద్ ప్రజలకు వెన్నుపోటు పొడవడమే అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సీసీఐ ఫ్యాక్టరీని పునఃప్రారంభించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేసిందన్నారు.

సీసీఐను తిరిగి ప్రారంభిస్తే ఆదిలాబాద్‌లోని వేలాది మంది యువతకు ఉపాధి దొరుకుతుందన్న ఉద్దేశ్యంతో ప్రధాని మోడీతో పలుమార్లు ఈ విషయంపై నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు జరిపారన్నారు. ఇంతేకాదు తానే స్వయంగా కేంద్ర మంత్రులైన నిర్మలా సీతారామన్, మహేంద్రనాథ్ పాండే, పీయూష్ గోయల్‌లను పలుమార్లు కలవడంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు కూడా రాశానని గుర్తుచేశారు. మోడీ తలుచుకుంటే సీసీఐ పున:ప్రారంభం పెద్ద విషయం కాదన్నారు. ఆదిలాబాద్ ప్రజలకు ఆయువుపట్టు లాంటి సీసీఐని తిరిగి ప్రారంభించకుండా ఆ సంస్థ ఆస్తులను వేలం వేసేందుకు సిద్ధమవడం మోడీ ప్రభుత్వ కుటిలత్వానికి పరాకాష్ట అని కేటీఆర్ మండిపడ్డారు. 2018 ఎన్నికల ప్రచారంలో సీసీఐని తెరుస్తామని హామీ ఇచ్చిన బీజేపీ, ఇప్పుడు ఆ సంస్థను స్క్రాప్‌గా అమ్మేందుకు ఆన్‌లైన్ టెండర్లు పిలవడం ఆదిలాబాద్ ప్రజలకు చేసిన మోసమేనని కేటీఆర్ ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు కార్మికులతో కలిసి ఉద్యమిస్తామని, సంస్థ పరిరక్షణ కోసం పోరాడతామని కేటీఆర్ ప్రకటించారు.

Next Story