తెలంగాణపై చంద్రబాబు ఫోకస్.. రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక మలుపు చోటు చేసుకోనుందా..?

by Disha Web Desk 19 |
తెలంగాణపై చంద్రబాబు ఫోకస్.. రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక మలుపు చోటు చేసుకోనుందా..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక ఫలితాలతో తెలంగాణ రాజకీయాలు కీలక మార్పు దిశగా వెళ్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో పొత్తులపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, టీడీపీ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారుతోంది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీ ట్రబుల్ షూటర్ అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో భేటీ కావడం చర్చకు దారితీసింది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇవాళ తెలంగాణ నేతలతో చంద్రబాబు భేటీ కాబోతుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. మంగళవారం మధ్యాహ్నం ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు రాబోతున్నారు.

రెండోసారి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా టీటీడీపీ నేతలు చంద్రబాబును సన్మానించనున్నారు. అనంతరం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, రానున్న ఎన్నికల్లో తెలంగాణ టీడీపీ అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అయితే అమిత్ షాతో భేటీ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ జతకట్టే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం వినిపిస్తోంది. ఈ క్రమంలో పొత్తుల వ్యవహారంపై పార్టీ నేతలకు చంద్రబాబు ఎలాంటి క్లూ ఇవ్వబోతున్నారనేది ఉత్కంఠగా మారింది.

మరోవైపు బీజేపీ పెద్దలను చంద్రబాబు కలవడంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ క్యాజువల్‌గా తీసుకున్నారు. టీడీపీతో బీజేపీకి పొత్తు అనేది ఊహాగానాలేనని బండి సంజయ్ ఈ ప్రచారాన్ని ఖండించాయి. అయితే ఈ సారి ఎన్నికల్లో తప్పక గెలవాలని చూస్తున్న బీజేపీ సెటిలర్లు నివాసం ఉంటున్న సెగ్మెంట్లో టీడీపీ ఓట్లను తమకు అనుకూలంగా మార్చుకోబోతున్నదా లేక ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ప్రచారం వెనుక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా అనేది సస్పెన్స్ గా మారింది.



Next Story