యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు.. అధికారిక ఉత్తర్వులు విడుదల

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-30 16:31:47  IST  )

యాదగిరిగుట్ట దేవస్థానంపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది.

యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు.. అధికారిక ఉత్తర్వులు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి నూతన బోర్డును ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ చట్టం ప్రకారం సరికొత్త పాలక మండలిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

బోర్డు సభ్యురాలిగా కొణిదెల సురేఖ..

అయితే, నూతన బోర్డుకు చైర్మన్‌గా ఎం. సత్యనారాయణ రెడ్డి నియమితులయ్యారు. బోర్డులో చైర్మన్‌తో పాటు సభ్యులుగా, ఎక్స్-అఫీషియో సభ్యులుగా మొత్తం 18 మందికి చోటు దక్కింది. సభ్యులుగా ఎన్నికైన వారిలో వినోద్ వెంకటస్వామి, ఎమ్మెల్యే సురేఖ, చిలపగారి విజయరాజం, విజయేందర్ తుల్లా, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండు మల్లయ్య, స్వాతి కాంతమణి, ఎం.రాఘవేందర్ రావు, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ ఫౌండర్ ట్రస్టీ, ఎక్స్-అఫీషియో సభ్యులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, దేవాదాయ శాఖ కమిషనర్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (YTDA) వైస్ చైర్మన్, యాదగిరిగుట్ట దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (EO), సీనియర్ ప్రధాన అర్చకులు ఈ బోర్డులో వ్యవహరిస్తారు. అనూహ్యంగా బోర్డులో సభ్యురాలిగా మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు చోటు కల్పించారు.

రెండేళ్ల పదవీ కాలం..

ఎక్స్-అఫీషియో సభ్యులు, ఫౌండర్ ట్రస్టీ మినహా మిగిలిన నామినేటెడ్ సభ్యులు, చైర్మన్ పదవీ కాలం వారు బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి రెండు సంవత్సరాల పాటు, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అమల్లో ఉంటుంది. నూతనంగా నియమితులైన చైర్మన్, సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించడానికి యాదగిరిగుట్ట దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (EO) తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో ఆదేశించింది.




Next Story