టీ-కాంగ్రెస్‌లో మరో అలజడి.. మర్రి శశిధర్ రెడ్డి బాటలో ఐదుగురు ముఖ్య నేతలు?

by Disha Web Desk 2 |
టీ-కాంగ్రెస్‌లో మరో అలజడి.. మర్రి శశిధర్ రెడ్డి బాటలో ఐదుగురు ముఖ్య నేతలు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీ-కాంగ్రెస్‌లో మరోసారి అలజడి రేగింది. మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరడంతో కొత్త చర్చ మొదలైంది. అసలే అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న హస్తం పార్టీకి తాజాగా జరుగుతున్న ఓ ప్రచారం మరింత టెన్షన్ పెట్టిస్తోంది. గతంలో తమ పార్టీ నేతలపై టీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించగా తాజాగా బీజేపీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్‌ను ఖాళీ చేసే ప్రయత్నాలు చేస్తోందనే టాక్ కాంగ్రెస్ పార్టీలో రోజు రోజుకు బలపడుతోంది. ఇప్పటికే విజయశాంతి, డీకే అరుణ, పొంగులేటి సుధాకర్, కూనం శ్రీశైలం గౌడ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలతో పాటు మరి కొంతమంది నేతలను కాంగ్రెస్ నుంచి తమవైపు ఆకర్షించడంలో బీజేపీ సక్సెస్ అయింది. మర్రి శశిధర్ రెడ్డితో మరోసారి మొదలైన వలసల వ్యవహారం ఇంతటితో ఆగవని త్వరలో మరో ఐదుగురు కీలక నేతలు కాంగ్రెస్‌ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో పార్టీని వీడబోతున్నది ఎవరు? అనే అనుమానాలు కాంగ్రెస్ పార్టీలో రోజు రోజుకూ బలపడుతున్నాయి.

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేస్తున్న బీజేపీ పార్టీ.. కాంగ్రెస్ నేతలపై ఫోకస్ పెట్టడంతో పాటు రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే వివిధ జిల్లాల్లోని కొంత మంది మాజీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయనే చర్చ జరుగుతోంది. మునుగోడు ఫలితం అనుకూలంగా ఉంటే ఈ నేతలంతా ఇప్పటికే కాంగ్రెస్ ను వీడి బీజేపీ గూటికి చేరేవారని కానీ ఫలితం మరోలా రావడంతోనే చేరికలకు మరింత ఆలస్యం జరుగుతోందనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. తాజాగా పార్టీకి వీర విధేయుడిగా చెప్పుకున్న మర్రిశశిధర్ రెడ్డి కండువా మార్చివేయడంతో మిగతా వారు సైతం అదే బాటలోకి వచ్చేందుకు ఆలోచనలో పడ్డారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, మెదక్, రంగారెడ్డి ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన కొంత మంది మాజీ ప్రజాప్రతినిధులతో బీజేపీ ముఖ్యనేతలు రాయబారం సాగించినట్టు చెబుతున్నారు. అసలే సీనియర్లు, జూనియర్ల వివాదంతో హస్తం పార్టీలో వివాదాలు నిత్యకృత్యంగా మారిపోయాయి. మరో వైపు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైలెంట్ అయ్యారు. తాను కాంగ్రెస్ ను వీడబోనని గతంలో చెప్పిన వెంకట్ రెడ్డి.. మునుగోడు ఫలితం తర్వాత మరింత మౌనం దాల్చారు. దాంతో ఆయన భవిష్యత్ నిర్ణయం ఎలా ఉండబోతోందనేది ఇటు స్వపక్షం, అటు విపక్షంలోనూ అంచనా వేసుకోలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది సస్పెన్స్ గా మారుతోంది.

మరోవైపు రాష్ట్రంలోని పరిస్థితులను చక్కదిద్దే పనికి ఏఐసీసీ పూనుకుంది. రేవంత్ రెడ్డిని ఢిల్లీకి ఆహ్వానించి పార్టీ పరిస్థితిపై పోస్ట్ మార్టం నిర్వహిచే పనిలో పార్టీ పెద్దలు బిజీబిజీగా ఉన్నారు. అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీలో మకాం వేయగా మరో వైపు అదే ఢిల్లీలో మర్రిశశిధర్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకోవడం ఆసక్తికర పరిణామంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ మొదలు పెట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ను కాంగ్రెస్ పార్టీ పెద్దలు నిలువరించగలుగుతారా? లేక ఎప్పటిలానే మాకు అభ్యర్థుల కొరత లేదంటూ ఓ నిట్టూర్పుకే పరిమితం అవుతారా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


Next Story

Most Viewed