అగ్ని ప్రమాదాల పట్ల భద్రతపై రాష్ట్రపతి నిలయంలో అవగాహన కార్యక్రమం

by Naga Rani Yarlagadda |

సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండటంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

అగ్ని ప్రమాదాల పట్ల భద్రతపై రాష్ట్రపతి నిలయంలో అవగాహన కార్యక్రమం
X

దిశ,తెలంగాణ బ్యూరో : సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం లో అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండటం, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణ, ఆస్తి నష్టాన్ని ఎలా నివారించాలనే అంశాలపై విద్యార్థులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.సీఐఎస్‌ఎఫ్‌ ఫైర్ సర్వీస్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్,తెలంగాణ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎఫ్‌ఎస్‌టీఐ కమాండెంట్ జయదీప్ చౌదరి, సికింద్రాబాద్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ ప్రాథమిక అగ్ని భద్రతా చర్యలపై అవగాహన ఉండాలని సూచించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు భయాందోళనకు గురికాకుండా ఎవాక్యుయేషన్ ప్రక్రియను ఎలా చేపట్టాలో వివరించారు. వాస్తవ సంఘటనలను ఉదహరిస్తూ అగ్ని ప్రమాదాలకు గల కారణాలను, నివారణోపాయాలను విద్యార్థులకు అర్థమయ్యేలా విశ్లేషించారు. అనంతరం సిబ్బంది నిర్వహించిన లైవ్ డెమో అందరినీ ఆకట్టుకుంది. మంటలను ఆర్పేందుకు ఉపయోగించే ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు, ఫైర్ హైడ్రెంట్లను ఎలా ఆపరేట్ చేయాలో చేసి చూపించారు. అత్యవసర స్థితిలో భవనాల నుంచి సురక్షితంగా బయటకు వచ్చే విధానంపై మాక్ డ్రిల్ నిర్వహించారు. విద్యార్థులకు కూడా వీటిని వాడేలా శిక్షణ ఇచ్చారు. రాష్ట్రపతి నిలయం మేనేజర్ డా.కె.రజనీ ప్రియ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 10 విద్యాసంస్థల నుంచి వచ్చిన 500 మంది విద్యార్థులతో పాటు రాష్ట్రపతి నిలయం సిబ్బంది, కార్మికులు, భద్రతా దళాలు ఇందులో పాల్గొన్నారు.

Next Story