ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ బకాయిలను తక్షణమే చెల్లించాలి : కేంద్ర మంత్రి బండి సంజయ్​

by Malleboina Mahesh |

రాష్ట్రంలో విద్యా సంస్ధలు తమకు ఇవ్వాల్సిన బకాయిలు అడిగితే ప్రభుత్వం విజిలెన్స్ దాడులతో బ్లాక్ మెయిల్ చేస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్​కుమార్​ఆరోపించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ బకాయిలను తక్షణమే చెల్లించాలి : కేంద్ర మంత్రి బండి సంజయ్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో విద్యా సంస్ధలు తమకు ఇవ్వాల్సిన బకాయిలు అడిగితే ప్రభుత్వం విజిలెన్స్ దాడులతో బ్లాక్ మెయిల్ చేస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్​కుమార్​ఆరోపించారు. విద్యార్థుల, యాజమాన్యాల భవిష్యత్తులో చెలగాటమాడితే సహించేది లేదని, బ్లాక్ మెయిల్ చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. బుధవారం నల్లకుంటలోని శంకర్ మఠ్​ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం మాట్లాడుతూ కమీషన్లు రావనే సాకుతో బకాయిలు చెల్లించడం లేదని, అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని కూడా కాలరాస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పదేపదే ఇచ్చిన మాటను తప్పే వాళ్లను ఏమి అనాలో తమకు అర్థం కావడం లేదని బీహార్ ఎన్నికలకు పైసలు ఇక్కడి నుండే పంపుతున్నారని పేర్కొన్నారు.

విద్యార్థుల భవిష్యత్తు కోసం బకాయిలు చెల్లించలేరా అంటూ నిలదీస్తూ ఈసారి తక్షణమే బకాయిలు మొత్తం చెల్లించాల్సిందేననని లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులు, యాజమాన్యాలతో కలిసి మంత్రులను రోడ్లపై తిరగనీయమని యాజమాన్యాలు ప్రభుత్వానికి భయపడి సమ్మె విరమిస్తే అంతే సంగతులు అని భవిష్యత్తులో మీకు ఎవరు అండగా నిలబడే పరిస్థితి ఉండదన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలపైనా రోడ్డెక్కడం తథ్యమన్నారు. జూబ్లీహిల్స్​ఎన్నికల్లో బీఆర్​ఎస్​, కాంగ్రెస్​పార్టీలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, గత పదేళ్ల కేసీఆర్​పాలన, ప్రస్తుతం రేవంత్​పాలనలో ఈ నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదన్నారు. ఈ ఎన్నికల్ల తమ పార్టీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

కేంద్ర మంత్రి అమిత్ షాకు జన్మదిన శుభాకాంక్షలు

రాజకీయ మార్గదర్శి, గురువు అమిత్ షా అంటూ దేశం ఫస్ట్ అనే ఆలోచనతో జీవించే, శ్వాసించే నేత అన్నారు. రాజకీయాలను వ్యూహంతో, సేవతో చూడగల తత్త్వాన్ని అమిత్ షా నుంచి నేర్చుకున్నట్లు ఎక్స్​వేదికగా తెలిపారు. ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా అయోమయానికి గురి కాకుండా ప్రశాంత మనసుతో ఆలోచించే నాయకుడని వెల్లడించారు. ఆయన చెప్పే విషయాలు నెలల తరబడి నా ఆలోచనలను, ప్రణాళికలను, చర్యలను ప్రభావితం చేస్తాయి. ఎన్నికల కోసమే కాదని భవిష్యత్ తరాల కోసం ప్రణాళికలు రూపొందించే మహా నాయకుడు అని పేర్కొన్నారు. స్పష్టత, దృఢ సంకల్పంతో భారత రాజకీయ ప్రస్థానాన్ని నడిపిస్తున్న అమిత్ షా కు విజయం అందిస్తూ దీర్ఘాయుష్షు, ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవించాలని అమ్మవారిని వేడుకుంటున్నట్లు చెప్పారు.

Next Story