యూరియా సరఫరా ఆలస్యం.. ఖరీఫ్ సీజన్‌పై ప్రభావం?

by Naga Rani Yarlagadda |

రైతన్నల్లో ఖరీఫ్ సీజన్ కు యూరియా కొరత ఏర్పడుతుందన్న ఆందోళన మొదలైంది. కేంద్రం నుంచి యూరియా సరఫరా ఆలస్యం కావడంతో ముందస్తు బుకింగ్ లు పెరిగాయి.

యూరియా సరఫరా ఆలస్యం.. ఖరీఫ్ సీజన్‌పై ప్రభావం?
X

దిశ, తెలంగాణ బ్యూరో : వానాకాలం సీజన్‌కు ముందే రైతులు యూరియా కొనుగోలు చేపట్టారు. తొలకరి జల్లు కురిసిన తరువాత కొనుగోలు చేయాలంటే కొరత వస్తుందని ముందుగానే నిల్వలు సిద్ధం చేసుకుంటున్నారు. గత అనుభవాలను గుర్తు పెట్టుకుని అప్పులు తెచ్చిమరీ యూరియా యాప్​ద్వారా బుకింగ్​చేసుకుని ఇంట్లో భద్రపరుచుకుంటున్నారు. విత్తనాలు వేసే సమయంలో కొనుగోలు చేయాలంటే అంతా ఎగబడటంతో డిమాండ్​ఉంటుందని, దీంతో ఒకటి రెండు రోజులు క్యూలైన్లలో నిలబడ్సాలి వస్తోందని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2.15 లక్షల మెట్రిక్​టన్నులు యూరియా నిల్వలు ఉండగా ఆయా జిల్లాలకు 18 వేల మెట్రిక్​టన్నుల నుంచి 23 వేల మెట్రిక్​టన్నుల వరకు జిల్లాలను బట్టి వ్యవసాయ శాఖ కేటాయింపులు చేసింది. యూరియా రాగానే రైతులు కొనుగోలు మొదలు పెట్టారు. గత వారంరోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యూరియా నిల్వలలో 1.24 లక్షల మెట్రిక్​టన్నులు కొనుగోలు జరిగింది. నాలుగైదు రోజుల నుంచి పెద్దసంఖ్యలో రైతులు తీసుకుంటున్నారు. ఉన్న నిల్వలు ఐదారు రోజుల్లో పూర్తి కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

తప్పని ఎదురుచూపులు..

మే, జూన్​నెలలకు కేంద్రం కేటాయించిన 4 లక్షల మెట్రిక్​టన్నుల యూరియా దిగుమతి అయితే పంట సాగు చేసే రైతులందరికీ పంపిణీ చేయవచ్చు. కొరత పేరుతో కేంద్ర ఎరువులు, రసాయన శాఖ నిర్లక్ష్యం చేస్తే యూరియా కోసం రైతుల నిరసనలు తప్పవని వ్యవసాయ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటీవలే కేంద్రమంత్రి అన్ని రాష్టాలకు యూరియా కేటాయింపు సమానంగా ఉంటుందని, సమయానికి సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు మే నెలకు రావాల్సిన 2 లక్షల మెట్రిక్​టన్నులు యూరియా పూర్తిస్థాయిలో రాలేదు. దీంతో వ్యవసాయ శాఖ కేంద్ర అధికారులకు లేఖలు రాశారు. త్వరగా దిగుమతి చేయాలని కోరినట్లు తెలిసింది. రాష్ట్రానికి కేటాయించిన యూరియా నిల్వల తరలింపు గంగవరం పోర్టు నుంచి 10 వేల మెట్రిక్ టన్నులు, మహారాష్ట్రలోని జైగడ్ పోర్టు నుంచి 21 వేల మెట్రిక్ టన్నులు కోసం ఎదురుచూపులు తప్పడం లేదు.

యాప్‌తో క్యూలైన్లకు చెక్..

ఖరీప్​సీజన్‌లో కేంద్ర ప్రభుత్వం దేశంలో మొదటిసారి యూరియా యాప్‌ను తెలంగాణ నుంచి ప్రారంభించింది. ఇక్కడ విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన విధానం ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని పలు సందర్భాల్లో కేంద్రమంత్రులు ప్రశంసలు కురిపించారు. ఇదేవిధంగా తెలంగాణలో అమలు చేయాలని సూచించారు. యూరియా కోసం క్యూ లైన్‌లో నిలబడే పరిస్థితులు రాష్ట్రంలో ఇకనుంచి కనబడవు. విపక్ష పార్టీల విమర్శలకు తావు లేకుండా పారదర్శకంగా యూరియా అమ్మకాలు యాప్​ద్వారా జరుగుతోంది. ఇకా నుంచి రైతులకు యూరియా కొరత అనే మాట వినబడదు. కావాల్సిన రైతులు యాప్​ద్వారా బుకింగ్ చేసుకుని కేటాయించిన దుకాణాల వద్దకు వెళ్లి తీసుకెళ్లే సదుపాయం వ్యవసాయ శాఖ కల్పించింది.

కౌలు రైతుల కష్టాలు..

యాప్​ద్వారా యూరియా పొందాలంటే భూమికి సంబంధించిన పట్టాదారు పాసు బుక్​వివరాలు, భూమి హక్కు కలిగిన రైతు సెల్‌ఫోన్​నెంబర్​యాప్‌లో నమోదు చేయాలి. కౌలు రైతులు నేరుగా యూరియా కొనుగోలు చేసే పరిస్ధితి లేదు. వారంతా భూమి ఎవరి వద్ద కౌలుకు తీసుకున్నారో వారి పేరు మీదనే యూరియా బస్తాలు బుకింగ్ చేసుకోవాలి. పట్టాదారులు యాప్​నుంచి యూరియా బుకింగ్​చేయడానికి ఓటీపీ వస్తోంది. ఈ నెంబర్​ఖచ్చితంగా యాప్‌లో నమోదు చేయాలి. అయితే దానికి వారు ససేమిరా అంటున్నారు. ఓటీపీలతో తమ ఖాతాలో ఉన్న నగదు పోతుందని యూరియా యాప్​విషయంలో తమకు వద్దకు రావద్దని స్పష్టం చేస్తున్నట్లు తెలిసింది. దీంతో కౌలు రైతులు పంట సాగు చేయకుండా పడావు భూముల వారిని ఆశ్రయించి వారి పేరుతో యూరియాను బుకింగ్​చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రభుత్వం కౌలు రైతులకు సంబంధించిన చట్టాలను తీసుకొచ్చి అన్ని రకాల సంక్షేమ పథకాలు లబ్ధి పొందేలా చూడాలని కోరుతున్నారు.

Next Story