సర్కార్ రుణ మాఫీ ''మాయే''.. ఎన్నికల వేళ రైతుల్లో కొత్త అనుమానం..!

by Disha Web Desk 19 |
సర్కార్ రుణ మాఫీ మాయే.. ఎన్నికల వేళ రైతుల్లో కొత్త అనుమానం..!
X

రెండో సారి అధికారం చేపట్టిన సీఎం కేసీఆర్ చాలా హామీలను అమలు చేయలేదని విపక్షాలు ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. ముఖ్యమైన హామీల్లో రైతు రుణమాఫీ ఒకటి. ఈ పథకానికి రూ.21,556 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసిన ప్రభుత్వం.. ఈ నాలుగేండ్లలో విడుదల చేసింది కేవలం రూ.1,100 కోట్లు మాత్రమే. గతేడాది బడ్జెట్‌లో కేటాయింపులు చేసినా ఫండ్స్ మాత్రం విడుదల చేయలేదు. ప్రభుత్వ హామీ ప్రకారం వచ్చే నెల చివరి నాటికి రూ.75 వేల లోపు ఉన్న రుణాలు మాఫీ చేయాల్సి ఉన్నది. కానీ ఇప్పటి వరకు రూ.35 వేల లోపు రుణాలు మాత్రమే మాఫీ కాగా.. దాని ద్వారా కేవలం 7.25 లక్షల మంది రైతులకే లబ్ధి చేకూరింది. దీన్ని బట్టి చూస్తే రూ.లక్ష లోపు రుణం ఉన్న రైతులకు అవి మాఫీ అవుతాయా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ రెండోసారి 2018 డిసెంబరులో సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రైతులకు రూ.లక్ష లోపు ఉన్న రైతురుణాలను నాలుగు విడతల్లో మాఫీ చేస్తామన్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సందర్భంగా 2019 ఫిబ్రవరి 23న అసెంబ్లీ వేదికగా హామీ ఇచ్చారు. ఆ ప్రకారం ఈ ఏడాది మార్చి నాటికి రూ.75వేల లోపు రుణాలు మాఫీ కావాల్సి ఉంది.

కానీ ఇప్పటికి కేవలం రూ.35 వేల లోపు రుణం ఉన్న 7.27 లక్షల మంది రైతులకు మాత్రమే రూ.1,100 కోట్లతో మాఫీ అయింది. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో రైతు రుణమాఫీ స్కీం అమలుకు నోచుకోలేదు. గతేడాది బడ్జెట్‌లో హామీ ఇచ్చిన స్కీములు అమలు కాకపోవడంపై ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించి సమాధానాన్ని రాబట్టలేకపోయారు.

అసంపూర్తిగానే..

కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2014 నుంచి 2018 వరకు నాలుగు విడతల్లో 35.32 లక్షల మంది రైతుల (రూ.16,144 కోట్లతో) రుణాలు మాఫీ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించుకున్నది. రెండో సారి సీఎంగా బాధ్యతలు చెప్పట్టిన తర్వాత (2018 నుంచి 2023కు సంబంధించి) రుణమాఫీ కోసం సుమారు రూ. 21,556 కోట్ల మేర అవసరమవుతుందని సర్కారు అంచనా వేసింది.

మొదటి టర్మ్ లాగానే నాలుగు విడతల్లో రైతు రుణాలు మాఫీ చేయనున్నట్టు ప్రకటించింది. దాని ప్రకారం ఈ ఏడాది మార్చి చివరి నాటికి రూ.75 వేల లోపు రైతు రుణాలు మాఫీ కావాల్సి ఉన్నా.. కేవలం రూ.35 వేల రుణాలున్నవారికి మాత్రమే మాఫీ అయింది. మార్చి 2022 నాటికే రూ.50 వేల లోపు రుణాలున్నవారికి మాఫీ చేస్తామని సర్కారు హామీ ఇచ్చినా అది అమలు కాలేదు.

రూ.21 వేల కోట్లలో రూ.7 వేల కోట్లే

సెకండ్ టర్ములో (2018-2023) రైతు రుణమాఫీ కోసం రూ. 21,556 కోట్ల మేర అవసరవుతుందని రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు వేసుకున్నది. ఇప్పటివరకు రెండు విడతల్లో మార్చి 2022 నాటికి రూ.1,100.20 కోట్లు మాత్రమే విడుదల చేసినట్టు స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ.. గతేడాది జూన్ 14న జరిగిన సమావేశంలో వెల్లడించింది. ఆ తర్వాత రుణమాఫీ కోసం ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదు.

ఇప్పటివరకు రూ.35 వేల లోపు రుణాలున్న 7.27 లక్షల మంది రైతులకు మాత్రమే మాఫీ అయినట్టు కమిటీ స్పష్టం చేసింది. తాజాగా బడ్జెట్ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్న 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.90 వేల వరకు రైతు రుణాలు మాఫీ చేయనున్నట్టు ప్రకటించారు.

ఇందుకోసం రూ.6,385 కోట్లను బడ్జెట్‌లో పెట్టుకున్నట్టు తెలిపారు. హామీ ఇచ్చినట్టుగా ఈ ఫండ్‌ను రిలీజ్ చేసినా రుణమాఫీ స్కీమ్ కోసం ప్రభుత్వం విడుదల చేసింది రూ.7,485 కోట్లు మాత్రమే అవుతుంది. ఇంకా సుమారు రూ.14,000 కోట్ల మేర విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందన రుణమాఫీ హామీ.. పూర్తిస్థాయిలో అమలు కాకుండా పెండింగ్‌లోనే ఉండిపోనుందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదే కాకుండా రూ.90 వేల నుంచి రూ.లక్ష మధ్యలో ఉన్న రైతుల రుణమాఫీది కూడా అదే పరిస్థితి.

ప్రభుత్వ హామీ ప్రకారం వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి రూ.లక్షలోపు రుణమాఫీ పూర్తికావాలి. ఆ అంచనా ప్రకారం వచ్చే నెలలోపు రూ.75 వేల లోపు రుణం ఉన్న రైతులందరికీ మాఫీ కావాలి. కానీ ఇప్పటికీ సెకండ్ ఫేజ్ (రూ.50 వేల లోపు ఉన్నవారికి) కంటిన్యూ అవుతూ ఉన్నదని మంత్రి నిరంజన్ రెడ్డి ఆదివారం (ఫిబ్రవరి 12) సభా వేదికగా క్లారిటీ ఇచ్చారు. థర్డ్ ఫేజ్‌లో భాగంగా ఈ ఏడాది మార్చి చివరినాటికి రూ.75 వేల వరకు రుణం ఉన్నవారికి మాఫీ చేస్తామని గతేడాది మార్చి 7న మంత్రి హరీశ్‌రావు తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.

కానీ ఆ హామీ అమలుకు నోచుకోలేదు. ఇంకా సెకండ్ ఫేజ్‌లోనే ఉన్నట్టు వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పడంతో థర్డ్ ఫేజ్ ప్రారంభం కాలేదని స్పష్టమైంది. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున థర్డ్, ఫోర్త్ ఫేజ్ (పాక్షికంగా) కలిపి ఒకేసారి అమలు చేయాలన్న ప్లాన్‌ను హరీశ్‌‌రావు వివరించారు. కానీ నిధులు మాత్రం దానికి తగిన తీరులో బడ్జెట్‌లో కేటాయించలేదు.

ఫస్ట్ టర్మ్ (2014-18)

రైతు రుణమాఫీ నిధులు : రూ. 16,144 కోట్లు

లబ్ధిపొందిన రైతులు : 35.32 లక్షల మంది

సెకండ్ టర్మ్ (2018-23)

రుణమాఫీ అంచనా మొత్తం : రూ.21,556 కోట్లు

ఇప్పటి వరకు విడుదలైంది : రూ.1,100 కోట్లు

లబ్ధిపొందిన రైతులు : 7.27 లక్షల మంది

ఇవి కూడా చదవండి : కేసీఆర్ ఆహ్వానాన్ని తిరస్కరించిన కీలక నేతలు.. అందుకే సెక్రటేరియట్ ఓపెనింగ్ వాయిదా?

Next Story

Most Viewed