ఫేక్ ఫ్యాకల్టీ.. ఫెయిల్ అవుతున్న విద్యా వ్యవస్థ

by Naga Rani Yarlagadda |

తెలంగాణ ఉన్నత విద్యావ్యవస్థలో నైపుణ్యాలను పెంచి ఉపాధి కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నా, క్షేత్రస్థాయిలో కొన్ని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల అక్రమాలు అడ్డంకిగా మారాయి.

ఫేక్ ఫ్యాకల్టీ.. ఫెయిల్ అవుతున్న విద్యా వ్యవస్థ
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఉన్నత విద్యావ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి విద్యార్థుల్లో స్కిల్స్ పెంచి, ఉపాధి అవకాశాలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. అందులో భాగంగానే కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. కానీ సర్కారు ఆశయానికి అనుగుణంగా కొన్ని ఇంజినీరింగ్ కాలేజీలు సాంకేతికపరంగా సరైన ప్రమాణాలు పాటించడం లేదు. నిబంధనల ప్రకారం ఉండాల్సిన అర్హత గల అధ్యాపకులు లేకపోయినా, కేవలం కాగితాలపై ఫ్యాకల్టీని చూపిస్తూ మేనేజ్‌మెంట్లు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇలా రాష్ట్రంలోని పలు ప్రైవేట్ కాలేజీల్లో బోగస్ దందా కొనసాగుతున్నది. అధ్యాపకులు ఉండరు, పాఠాలు చెప్పరు అన్న చందంగా తయారైంది. నిబంధనలు ఉల్లంఘిస్తున్న కాలేజీలపై క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు చేసినప్పటికీ విద్యాశాఖ అధికారులు లెక్కచేయడం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో సాగుతున్న అక్రమాలు, ఫేక్ ఫ్యాకల్టీ వ్యవహారాలపై స్పష్టమైన సమాచారం ఉన్నప్పటికీ, ఉన్నత విద్యామండలి అధికారులు చర్యలు చేపట్టేందుకు వెనకాడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కాలేజీ సిబ్బంది.. స్కూలు బయోమెట్రిక్!

ఇటీవల రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ అబ్దుల్లాపూర్ మెట్ లో ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీలో బోగస్ ఫ్యాకల్టీ ఉదంతం వెలుగుచూసింది. ఈ కాలేజీ అబ్దుల్లాపూర్ మెట్‌లో ఉండగా, ఇదే కళాశాల యాజమాన్యానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూలులో సిబ్బంది బయోమెట్రిక్ హాజరు వేసి వెళ్తున్నారని ఉన్నత విద్యామండలి, సీఎం సెక్రెటరీ అజిత్ రెడ్డికి ఫిర్యాదులు అందాయి. పెద్దసంఖ్యలో ఫేక్ ఫ్యాకల్టీ ఉన్నారని, అక్కడ తనిఖీలు నిర్వహించాలనే విషయం ఉన్నత విద్యామండలి దృష్టికి గత వారం రోజుల క్రితమే వచ్చింది. వాస్తవానికి కాలేజీలో అధికారులు అప్పుడే విజిట్ చేయాల్సి ఉంది. కాగా, కాలేజీ యాజమాన్యాల ఒత్తిడి లేదా? ఇతర మరే కారణమో తెలియదు గానీ అధికారులు అటువైపు వెళ్లడం లేదు. తనిఖీ బృందాలు ఎందుకు వెనకడుగు వేస్తున్నాయని ప్రశ్నార్థకంగా మారింది. ఆ కాలేజీ ఓ ఎమ్మెల్యేకు చెందినది కావడంతోనే టచ్ చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

అర్హత లేని ఫ్యాకల్టీతో పాఠాలు

రాష్ట్రంలోని చాలా కాలేజీల్లో అర్హత లేని వారు సైతం అసిస్టెంట్ ఫ్రొఫెసర్ల హోదాతో కొనసాగుతున్నారు. పేరొందిన కాలేజీల్లోనూ అరకొరగా ల్యాబ్‌లు ఉండటం కాదనలేని వాస్తవం. కాలేజీల్లో సీట్ల పెంపు కోసం ఇతర కాలేజీల్లో పనిచేస్తున్న వారి పేర్లు, లేదా అసలు టీచింగ్ అనుభవమే లేని వారిని ఫ్యాకల్టీగా రికార్డుల్లో చూపుతున్నారు. కేవలం తనిఖీల సమయంలో మాత్రమే కొంత మందిని పిలిచి హాజరు వేయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అర్హత లేని వారితో పాఠాలు చెప్పించడం ద్వారా విద్యార్థుల ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి. ఓ వైపు ప్రభుత్వం విద్యాప్రమాణాలను పెంచుతామని చెబుతుండగా, క్షేత్రస్థాయిలో ఉన్నత విద్యామండలి తీరు మాత్రం అందుకు విరుద్ధంగా ఉందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. తనిఖీలు నిర్వహించి బోగస్ కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు కోరుతున్నారు.

Next Story