TG: పంచాయతీ కార్యదర్శుల అతి తెలివి.. ఒకరి తొలగింపు, 15 మంది సస్పెండ్, 47 మందికి నోటీసులు

by Gantepaka Srikanth |

పంచాయతీ రాజ్​శాఖలో నకిలీ అటెండెన్స్ కలకలం రేపుతోంది. పారదర్శకత, జవాబుదారితనం కోసం తీసుకువచ్చిన ఫేస్​రికగ్నైషన్​యాప్‌నే కొందరు గ్రామ పంచాయతీ కార్యదర్శులు బోల్తా కొట్టించారు.

TG: పంచాయతీ కార్యదర్శుల అతి తెలివి.. ఒకరి తొలగింపు, 15 మంది సస్పెండ్, 47 మందికి నోటీసులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: పంచాయతీ రాజ్​శాఖలో నకిలీ అటెండెన్స్ కలకలం రేపుతోంది. పారదర్శకత, జవాబుదారితనం కోసం తీసుకువచ్చిన ఫేస్​రికగ్నైషన్​యాప్‌నే కొందరు గ్రామ పంచాయతీ కార్యదర్శులు బోల్తా కొట్టించారు. అధికారులను బురిడీకొట్టించి గ్రామాల్లో విజిట్ చేయకుండా తప్పుడు వివరాలు, ఫేక్​ ఫోటోలు, ఏకంగా సీఎం ఫోటోలను, ఖాళీ కుర్చీల ఫోటోలను సైతం అప్‌లోడ్​చేసి అభాసుపాలయ్యారు. వంద‌ల సంఖ్యలో ఫేక్ అటెండెన్స్ న‌మోదవ్వడంపై ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వందల సంఖ్యలో ఫేక్ అటెండెన్స్ నమోదవ్వడంపై పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ‌ మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యం వ‌హిస్తే ఉపేక్షించవ‌ద్దని సంబంధిత అధికారులను గట్టిగా హెచ్చరించారు. దీంతో ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు ఇప్పటివరకు 553 మంది పంచాయతీ సెక్రెటరీలు ఫేక్ అటెండెన్స్ వేసినట్లు గుర్తించారు. అవుట్‌సోర్సింగ్ విధానంలో పంచాయ‌తీ కార్యద‌ర్శిగా పనిచేస్తున్న ఒకరిని వెంటనే సర్వీస్ నుంచి తొలగించగా.. మరో 15 మందిని సస్పెండ్ చేశారు. మిగిలిన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సెక్రెటరీల హాజరును పర్యవేక్షించాల్సిన ఎంపీఓలు విధుల్లో నిర్లక్ష్యం వహించారని గుర్తించిన ప్రభుత్వం 47 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది.

ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్యం, సేవలు అందాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రతి గ్రామానికి పంచాయతీ కార్యదర్శులను నియమించగా.. వారు అందుబాటులో ఉండట్లేదని గుర్తించి ఫేస్ రికగ్నైషన్​యాప్‌ను తీసుకొచ్చింది. అయినప్పటికీ వారిలో ఎలాంటి మార్పురాలేదు. తాజాగా వీరి హాజరుపై ఫిర్యాదులు రావడంతో అధికారులు పరిశీలించగా ఫేక్ అటెండెన్స్​వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కాగా, అత్యధికంగా నకిలీ హాజరు నమోదు చేసిన వారిలో సిద్దిపేట జిల్లా నుంచి 70 మంది, నల్గొండ జిల్లాలో 69, వికారాబాద్‌లో 63, సూర్యాపేటలో 48, కామారెడ్డి జిల్లాలో 43, కొత్తగూడెంలో 42 మంది ఉన్నారు. సస్పెండ్​అయిన కార్యదర్శుల్లో వనపర్తి జిల్లాలో అత్యధికంగా ఏడుగురు ఉండగా, సరైన పర్యవేక్షణ చేయని ఎంపీవోలలో కొత్తగూడెంలో 17 మంది, నల్గొండ జిల్లాలో 15 మంది ఉన్నారు. కాగా, అత్యధికంగా ఫేక్ అటెండెన్స్​నమోదైన సిద్దిపేట జిల్లాలో మాత్రం కేవలం ఒక ఎంపీవోది మాత్రమే నిర్లక్ష్యం ఉన్నట్లు గుర్తించారు.




Next Story