సంక్రాంతి వేళ ప్రైవేట్ ట్రావెల్స్ నిలువు దోపిడీ.. ఏ మూలకూ సరిపోని ఆర్టీసీ బస్సులు

by Disha Web Desk 2 |
సంక్రాంతి వేళ ప్రైవేట్ ట్రావెల్స్ నిలువు దోపిడీ.. ఏ మూలకూ సరిపోని ఆర్టీసీ బస్సులు
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్తున్న వారిని ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు నిలువు దోపిడీ చేస్తున్నాయి. పండుగకు వెళ్లే వారి రద్దీకి తగ్గట్లుగా ఆర్టీసీ బస్సులు, రైళ్లు లేకపోవడంతో ప్రజలు ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో నివాసం ఉంటున్న ఏపీ, తెలంగాణకు చెందిన వారిలో అధికశాతం మంది పండుగకు గ్రామాలకు తరలి వెళ్తుంటారు. ఆర్టీసీ బస్సులు ఏమూలకు సరిపోకపోవడంతో విశాఖ, విజయవాడ, రాజమండ్రి, శ్రీకాకుళం, బెంగళూరు, తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు తదితర ప్రాంతాలకు వెళ్లే వారు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. దీనిని సొమ్ము చేసుకోవడానికి ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు టికెట్ ధరలను అమాంతంగా పెంచేశారు. ఈ క్రమంలో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీని అరికట్టేందుకు, ఫిట్ నెస్ లేని బస్సులు కూడా రోడ్డు మీదికు వస్తున్నాయి. పండుగకు ఏపీకి వెళ్లే వారు లక్షలలో ఉండడంతో దాదాపు నగరం చాలా వరకు ఖాళీ అవుతుంది. ఇది ప్రతి సంవత్సరం వస్తున్న ఆనవాయితీ అయినప్పటికీ రద్దీకి తగ్గట్లుగా బస్సులు నడపడంలో ఆర్టీసీ అధికారులు విఫలమయ్యారని ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని దోపిడీని కొనసాగిస్తూ ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియాలా మారాయనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.

అధిక చార్జీలు వసూలు..

పండుగకు ఊరెళ్లే ప్రయాణీకుల నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు మూడు రెట్లు అధికంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. రద్దీకి తగ్గట్లుగా ఏపీ, తెలంగాణలకు వెళ్లేందుకు సరిపడా బస్సులు లేకపోవడం ట్రవెల్స్ యాజమాన్యాలకు కలిసి వస్తోంది. ఏసీ, నాన్‌ ఏసీ, సీటింగ్‌, స్లీపర్‌ అన్నింట్లోనూ ఇదే తరహాలో చార్జీలు వసూలు చేస్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితులలో ప్రజలు ప్రయాణాలు చేస్తున్నారు.

తూతూ మంత్రంగా అధికారుల చర్యలు..

ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఇంతలా ప్రయాణీకులను దోచేస్తుంటే ఆర్టీఓ, రవాణా శాఖ అధికారులు తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారని ప్రయాణీకులు వాపోతున్నారు. పండుగ సందర్భంగా అధికారులు తనిఖీలు చేసే అవకాశం ఉంటుందని ముందుగానే పసిగట్టిన ట్రావెల్స్ యాజమాన్యాలు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటూ తమ దోపిడిని యదేచ్ఛగా కొనసాగిస్తున్నారు. హైవేలను వదిలేసి ఇతర మార్గాల ద్వారా వాహనాలు నడిపిస్తున్నారు. దీంతో అధికారుల తనిఖీలలో అతి కొద్దిమంది అక్రమార్కులు మాత్రమే పట్టుబడుతున్నారు.

రద్దీగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు..

సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత గ్రామాలకు వెళ్లేవారితో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ నగరం నుంచి సుమారు 15 లక్షల మందికి పైగా సొంతూళ్లకు వెళ్లే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గ్రామాలకు వెళ్లే ప్రయాణిలకు అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా అదనపు బస్సులను పెట్టి తగిన ఏర్పాట్లు చేశారు. అయినా అవి ఏమూలకు సరిపోకపోవడంతో ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతున్నారు. మరికొన్ని గంటలలో పండుగ ఉండడంతో ఊరెలుతున్న వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ చర్యలు తీసుకోవాలని, ప్రైవేట్ ట్రావెల్స్ నిలువు దోపిడిని నిలువరించాలని ప్రయాణీకులు కోరుతున్నారు.



Next Story

Most Viewed