మైనంపల్లి నిర్ణయంపై ఉత్కంఠ.. హస్తం నేతల్లో టెన్షన్..!?

by Disha Web Desk 4 |
మైనంపల్లి నిర్ణయంపై ఉత్కంఠ.. హస్తం నేతల్లో టెన్షన్..!?
X

రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావుపై తిరుమలలో మైనంపల్లి హన్మంతరావు ఘాటుగా ఆరోపణలు చేయడంతో మెదక్ నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. కాంగ్రెస్ నేతల్లో మైనంపల్లి ఎంట్రీ, నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఇన్నాళ్లు టిక్కెట్ తమదే అనే ధీమాతో ఉన్న నేతలకు ఆయన పార్టీలోకి వస్తున్నారన్న ప్రచారం జోరందుకుంది. కాగా బీఅర్ఎస్ నేతలతో సంప్రదింపులు సాగుతుండటంతో చర్చలు సఫలం కావాలని పలువురు నేతలు ఆకాంక్షిస్తున్నారు.

విఫలమైతే తమ ఆశలకు గండిపడుతుందన్న ఫీవర్ ఆందోళన కాంగ్రెస్ ఆశావహుల్లో నెలకొంది. కాంగ్రెస్ టిక్కెట్ తనదే అన్న ధీమాతో ఇంతకాలం డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి ప్రచారం ముమ్మరం చేశారు. మైనంపల్లి ఎంట్రీతో ఇంటింటికీ కాంగ్రెస్ కార్యక్రమానికి బ్రేక్ వేశారు. తిరుపతిరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, సుప్రభాత్ రావు, మ్యాడమ్ బాలకృష్ణ, పలువురు నాయకులు గాంధీ భవన్‌లో దరఖాస్తు సైతం చేశారు. హన్మంతరావు నిర్ణయం ఏదైనా తాము వెంటే ఉంటామని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఏదేమైనా మెదక్ రాజకీయం అంతా మైనంపల్లి తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉందనే చెప్పొచ్చు. ఒకటి రెండు రోజుల్లో దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

- దిశ, మెదక్ ప్రతినిధి

రాష్ట్రంలో ఎన్నికల సందడి ప్రారంభం కాగానే అన్ని నియోజకవర్గాల్లో సర్దుబాట్లు జోరుగా సాగుతున్నాయి.. మెదక్ నియోజక వర్గంలో మాత్రం కాంగ్రెస్ టిక్కెట్ నాదే అన్న ధీమాతో డీసీసీ అధ్యక్షుడు కంఠా రెడ్డి తిరుపతి ప్రజల్లోకెళ్లడం ప్రారంభించారు. తిరుపతిరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, సుప్రభాత్ రావు, మ్యాడమ్ బాలకృష్ణతో పాటు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఆశిస్తూ ఆశావహులు దాదాపు10 గాంధీ భవన్‌లో దరఖాస్తు సైతం చేశారు. ఎవరికి వారిగా టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేయడంతో పాటు టిక్కెట్ తనదే అనే ధీమాలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.

రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావుపై తిరుమలలో హన్మంతరావు ఘాటు ఆరోపణలు చేయడంతో ఒక్క సారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. కాంగ్రెస్ టిక్కెట్ రోహిత్ కు ఇచ్చారన్న ప్రచారం సాగింది. కానీ మైనంపల్లి కొంత మెత్త పడ్డాడని, ఆయన బీఅర్ఎస్‌లోనే కొనసాగుతారని ప్రచారం కూడా సాగింది. వారం గడువు తరవాత రాజకీయ భవిష్యత్తు‌పై ప్రకటన చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పటికీ మైనంపల్లి ఎలాంటి ప్రకటన చేయలేదు.

బీఅర్ఎస్ నేతలతో హన్మంతరావు చర్చలు సాగుతున్నాయని ఆయన వర్గీయులు చెబుతున్న.. స్థానిక నేతలు మాత్రం ఆయన కాంగ్రెస్‌లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న చర్చ కూడా సాగుతుంది. నిర్ణయం ఏదైనా బరిలో ఉండడం పక్కాగా మెదక్‌లో ఉన్న మద్దతుదారులు చెబుతున్న మాట. కానీ మైనంపల్లి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది కాంగ్రెస్ టిక్కెట్ ఆశిస్తున్న వారిపై పడుతుందని పలువురు వాపోతున్నారు. మల్కాజిగిరి టిక్కెట్ వచ్చిన కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం వెనక రోహిత్‌కు మెదక్ టిక్కెట్ ఇవ్వకపోవడమే కారణం.

మెదక్ బీఅర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి కేటాయించడంతో ఈ సీటు మార్చే అవకాశం లేదు. అధిష్టానంతో చర్చలు సాగిన మెదక్ విషయంలో పేచీ వల్ల విఫలం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే టెన్షన్ కాంగ్రెస్ నేతల్లో ఉంది. టిక్కెట్ ఆశిస్తూ ఇన్నాళ్లు పార్టీ కోసం పని చేస్తే.. చివరి నిమిషంలో వచ్చే వారికి ఇస్తే తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మైనంపల్లిని పార్టీలోకి తీసుకోవద్దని టిక్కెట్ ఆశిస్తున్న నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా ఇప్పటి వరకు ఎవరూ ముందుకు వచ్చి బహిరంగంగా చెప్పలేకపోయారు.. హన్మంతరావు తీసుకునే నిర్ణయంపై స్పందించాలన్నా ఉద్దేశంతో కాంగ్రెస్ నేతలు ఉన్నట్టు తెలుస్తుంది.. ప్రస్తుతం టిక్కెట్ విషయంలో నెలకొన్న గందరగోళం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంటా రెడ్డి తిరుపతి ఇంటింటికీ కాంగ్రెస్ కార్యక్రమానికి బ్రేక్ ఇచ్చినట్లు కనిపిస్తుంది. మెదక్ బీఅర్ఎస్ అభ్యర్థి ప్రకటనకు ముందు ఫుల్ జోష్‌గా గ్రామాల్లో పర్యటించిన ఆయన ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సందిగ్ధంలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే పార్టీ నిర్ణయం మేరకు కట్టుబడి ఉంటానని ఆయన ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

కాంగ్రెస్ నుంచి వచ్చినా సమ్మతమే..

హన్మంతరావు నిర్ణయం ఏది తీసుకున్న తాము వెంటే ఉంటానని ఆయన వర్గీయులు చెబుతున్నారు. అధికార పార్టీకి చెందిన నేతలు కొంత కాలంగా మెదక్ ఎమ్మెల్యే‌పై అసంతృప్తితో రోహిత్‌కు మద్దతుగా నిలిచారు. రోహిత్ మెదక్ నియోజక పర్యటన‌కు వచ్చిన ప్రతి సారి వెంట ఉన్నారు. దీనితో నియోజక వర్గ వ్యాప్తంగా బీఅర్ఎస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు అయన వెంట ఉన్న విషయం తెలిసిందే. పక్కా బీఅర్ఎస్ టిక్కెట్ రోహిత్‌కే వస్తుందన్న ధీమాలో ఉన్న తరుణంలో సీఎం కేసీఆర్ టిక్కెట్‌లు సిట్టింగ్‌లకే కేటాయించడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. మైనంపల్లికి మద్దతుగా నిలిచిన వారందరి పరిస్థితి గందరగోళంగా మారింది. కానీ తిరుపతిలో ఆయన చేసిన ఘాటు విమర్శలతో వాటిలో బలం చేకూరింది. బీఅర్ఎస్ టిక్కెట్ ఇవ్వకున్న బరిలో ఉంటారన్న సంకేతాలు ఇవ్వడంతో అసంతృప్త నేతలకు బలం వచ్చింది. కాంగ్రెస్, లేదా స్వతంత్రంగా బరిలో ఉన్న మైనంపల్లి వెంటే ఉంటానని చెబుతున్నారు.

మైనంపల్లి నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి

హన్మంతరావు తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మెదక్ బీఅర్ఎస్ టిక్కెట్ రోహిత్‌కు కేటాయించపోవడంతో ఆగ్రహించిన హన్మంతరావు మంత్రి హరీష్ రావు పై ఘాటు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కానీ తర్వాత మైనంపల్లిపై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పటికే కాంగ్రెస్‌కు మైనంపల్లి వెళ్తున్నారన్న ప్రచారం సాగడంతో అధిష్టానం కొంత మెత్తబడినట్లు చర్చ సాగింది. మైనంపల్లి ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారని ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.

బీఅర్ఎస్ పెద్దలతో చర్చలు సఫలం అయితే రోహిత్‌కు మెదక్ టిక్కెట్ ఇవ్వాలి కానీ అది సాధ్యం కాదు.. మల్కాజిగిరి నుంచి బీఅర్‌ఎస్ పార్టీ నుంచి బరిలో ఉండాలని కోరితే కుమారుడికి టిక్కెట్ ఇవ్వకుంటే అంగీకరించారు. ఇందులో ఎదీ కాకుండా మరేదైనా నిర్ణయం ఉంటుందా అనే చర్చ సాగుతోంది. రోహిత్ వర్గీయులు మాత్రం మెదక్ బ్యాలెట్‌లో రోహిత్ పేరు తప్పక ఉంటుందన్న ధీమాతో ఉన్నారు. మెదక్ రాజకీయం అంతా మైనంపల్లి తీసుకునే నిర్ణయం పై ఆధారపడి ఉంది.. ఒకటి రెండు రోజుల్లో దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Next Story

Most Viewed