వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి: మాజీమంత్రి తలసాని శ్రీనివాస్

by Ajay Maddhiboyina |

వచ్చే ఎన్నికలలో గోషామహల్ నియోజకవర్గంపై గులాబీ జెండా ఎగరాలని, అందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు.

వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి: మాజీమంత్రి తలసాని శ్రీనివాస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే ఎన్నికలలో గోషామహల్ నియోజకవర్గంపై గులాబీ జెండా ఎగరాలని, అందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నియోజకవర్గ ఇంచార్జి నాగేందర్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో పైరవీలకు తావు లేదని, కష్టపడి పనిచేస్తూ ప్రజాదరణ ఉన్న వారికే సముచిత స్థానం, గౌరవం లభిస్తాయని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వంలో గోషామహల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని గుర్తుచేశారు.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం, రూ.10 కోట్లతో ఫిష్ మార్కెట్, నాలా నిర్మాణం, డ్రైనేజీ సమస్యల పరిష్కారం వంటి అనేక కార్యక్రమాలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ నెల 24 వ తేదీ నుండి ప్రారంభం కానున్న ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంపై అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అక్రమంగా ఓట్లు పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా ఇంటింటికీ వెళ్లి సభ్యత్వ నమోదు చేపట్టాలని వివరించారు. ముఖ్యమంత్రి తన స్థాయిని మరిచి బూతు భాష మాట్లాడుతూ ఆయన స్థానానికి ఉన్న గౌరవాన్ని దిగజారుస్తున్నారని విమర్శించారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం శ్రీనివాస్‌యాదవ్, మహేందర్, ఉద్యమకారులు పాల్గొన్నారు.

Next Story