కేసీఆర్ ప్రభుత్వం కమీషన్లు వచ్చే ప్రాజెక్టులను చేపట్టింది.. రిటైర్డ్ కలెక్టర్ ఆకునూరి మురళి

by Dishafeatures2 |
కేసీఆర్ ప్రభుత్వం కమీషన్లు వచ్చే ప్రాజెక్టులను చేపట్టింది.. రిటైర్డ్ కలెక్టర్ ఆకునూరి మురళి
X

దిశ , తెలంగాణ బ్యూరో : కేసీఆర్ ప్రభుత్వం కమీషన్లు వచ్చే ప్రాజెక్టులు మాత్రమే ముందు చేపట్టిందని రిటైర్డ్ కలెక్టర్ ఆకునూరి మురళి ఆరోపించారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్లలో 52 శాతం పూర్తి చేస్తే, 9 నెలలు కేసీఆర్ ప్రభుత్వం 25% కూడా పూర్తి చేయలేదని తెలిపారు. మంగళవారం తెలంగాణ సకల జనుల వేదిక- తెలంగాణ జల సాధన సమితి ఆధ్వర్యంలో "ఎస్ఎల్బీసీ సొరంగం గ్రావిటీ కాలువలో నల్లగొండకు జరిగిన అన్యాయం ఏమిటి?" & "దశ దిశ లేని డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు" అనే అంశాలపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్ జరిగిన రౌండ్ టేబుల్ కార్యక్రమంలో పలువురు విశ్లేషకులు , ప్రముఖులు బీఆర్ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

ముఖ్య అతిధిగా పాల్గొన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి మాట్లాడుతూ .. 2000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును నిధులు కేటాయించక కరెంటు బిల్లుకే సుమారు 3000 కోట్లు ఖర్చుపెట్టిన దుస్థితి ఉందన్నారు. లక్షన్నర కోట్ల కాలేశ్వరం, రూ.45 వేల కోట్ల భగీరథ ప్రాజెక్టులలో వేగంగా దోచుకోవడం పైన ఉన్న శ్రద్ధ, 2000 కోట్ల తో పూర్తయ్యే దాంట్లో తగిన కమీషన్ రాదని నిధులు కేటాయించక నత్త నడకన నడిపించారన్నారు. ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులను సంవత్సరంలోగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బంగారు తెలంగాణ అని కేసీఆర్ తెలంగాణను అన్ని విధాల నాశనం చేసి అప్పుల గుట్టగా మార్చారని అన్నారు. అపారమైన వనరుల సంపద ఉన్నటువంటి రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం అన్ని విధాల దిగజార్చిందన్నారు.

విద్య, వైద్యం అడుగంటిపోయిందని విమర్శించారు. ఫ్లోరైడ్ నిర్మూలనకు ఎస్ఎల్బీసీ ప్రధానమైన ప్రాజెక్టు, తెలంగాణ ఉద్యమంలో ఫ్లోరైడ్ గురించి మాట్లాడిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఎస్ఎల్బీసీలో కమిషన్లు రావని దానికి నిధులు కేటాయించలేదన్నారు. కొత్త ప్రాజెక్టులు భారీ దోపిడీతో తెలంగాణ అప్పుల కుప్పగా మారితే వాటి కాంట్రాక్టర్ అయిన మెగా కృష్ణారెడ్డి ప్రపంచ కుబేరుడుగా ఎదిగారని అన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అన్ని విధాల వంచించారని, ఫ్లోరైడ్ నల్లగొండకు ఎనలేని ద్రోహం చేశారని పలువురు వక్తలు ఆరోపించారు.

ఈ సమావేశంలో జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి , రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విట్టల్ రావు, లక్ష్మీనారాయణ, పాత వెంకటరమణ నైనాల గోవర్ధన్, ఎస్.వెంకటేశ్వరరావు (సీపీఎంఎల్ న్యూడెమోక్రసీ),చెరుకు సుధాకర్ , కోటేశ్వరరావు (సీపీఎంఎల్ న్యూడెమోక్రసీ), అంబటి నాగయ్య, నీటిపారుదల విశ్లేషకులు సాంబశివరావు, మురళి, మురళీధర్ గుప్త , సోగరా బేగం, అన్వర్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed