కౌషిక్ రెడ్డి మాట‌ల‌కు ఎవ‌రో ఒక‌రు తంతార‌ని తెలుసు: కాంగ్రెస్ నేతల ఫైర్

by Ramesh Naini |

రోడ్డు మీద పోయే అవారాలాగా, వీధి రౌడీలా కేటీఆర్ మాట్లాడారని, ఆయనకు మించి మాట్లాడే శ‌క్తి మాకు ఉంది.. కానీ, మాకు విజ్ఞత ఉందని ప్రభుత్వ విప్ సీహెచ్. విజయరమణా రావు అన్నారు.

కౌషిక్ రెడ్డి మాట‌ల‌కు ఎవ‌రో ఒక‌రు తంతార‌ని తెలుసు: కాంగ్రెస్ నేతల ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రోడ్డు మీద పోయే అవారాలాగా, వీధి రౌడీలా కేటీఆర్ మాట్లాడారని, ఆయనకు మించి మాట్లాడే శ‌క్తి మాకు ఉంది.. కానీ, మాకు విజ్ఞత ఉందని ప్రభుత్వ విప్ సీహెచ్. విజయరమణా రావు అన్నారు. వ‌ర్షం ప‌డాలని, అక్కడకు వెళ్లి దొంగ ఏడుపులు ఏడ‌వాల‌ని కేటీఆర్ భావిస్తున్నారని ఆయన మండిపడ్డారు. గురువారం సీఎల్పీ మీడియా సెంటర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో కలిసి విజయరమణా రావు మాట్లాడారు. ప‌దేళ్లు మంత్రిగా ప‌నిచేసిన కేటీఆర్ పనికిరాని మాటలు మాట్లాడారని, తిట్ల కోసమే వ‌రంగ‌ల్ స‌భ పెట్టుకున్నారని ఆయన మండిపడ్డారు. ఎద్దు, వ్యవ‌సాయం గురించి తెలిసిన వారెవ‌ర్వరూ కేటీఆర్ లా మాట్లాడ‌రన్నారు. ప్రభుత్వాన్ని బ‌ద్నాం చేసి సీఎం సీటులో కూర్చోవాల‌న్నదే కేటీఆర్ ప్రయ‌త్నమని, మోకాళ్ల పైన న‌డిచినా ఆయన ఆ సీట్లలోకి వ‌చ్చేది లేదన్నారు. రూ. 12 వేల కోట్ల రుణ‌మాఫీ మాత్రమే చేశార‌ని కేటీఆర్ ప‌చ్చి అబ‌ద్దాలు చెపుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 20 వేల కోట్లు రైతు రుణ‌మాఫీ చేసిందని విజయరమణా రావు తెలిపారు. బీఆర్ఎస్ హ‌యాంలో రుణ‌మాఫీ జ‌రిగి మ‌ళ్లీ రుణం తీసుకున్న రైతు ఒక్కరైనా ఉన్నారా? ద‌మ్ము ఉంటే రుణ‌మాఫీ పైన తెలంగాణ‌లో ఏ గ్రామానికైనా కేటీఆర్ రావాలి.. తాము వ‌స్తామని ఆయన సవాల్ విసిరారు. అన్ని విధాలుగా రాష్ట్ర రైతుల‌ను కేసీఆర్ ముంచారని, వారి పాలనలో కేసీఆర్ మ‌క్కలను ఏనాడు కొనలేదని, తాము మార్క్ ఫెడ్ ద్వారా మ‌క్కలు కొనుగోలు చేస్తున్నామని విజయరమణా రావు చెప్పారు. రైతు బంధు ఇచ్చి అదే స‌ర్వరోగ నివారిణి అని కేసీఆర్ అన్నారని, నాలుగు పంట‌ల‌కు తమ ప్రభుత్వం రైతు భ‌రోసా ఇచ్చామన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులు స‌రైన‌వి కాదని, కౌషిక్ రెడ్డి మాట‌ల‌కు ఎవ‌రో ఒక‌రు తంతార‌ని అనుకుంటున్నాం.. అదే జ‌రిగిందని విజయరమణా రావు విమర్శించారు.

సీఎం కావాల‌ని ఆశపడుతున్న కేటీఆర్ : ప్రభుత్వ విప్ యెన్నం

కేటీఆర్ తీరు చూశాక కొద్దొ గొప్పొ ఉన్న ఇమేజ్ పోయిందని, అస‌లు స్వరూపం బ‌య‌ట‌ప‌డింది.. ప్రవ‌ర్తన మార్చుకోక‌పోతే కేటీఆర్ సిరిసిల్లలో కూడా గెల‌వ‌రని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి ధ్వజమెత్తారు. కేటీఆర్ వ‌రంగ‌ల్ స‌భ‌లో మాట్లాడిన తీరు చూసి అంద‌రు ముక్కున వేలేసుకుంటున్నారని, ఆయ‌న చ‌దువు చూసి భాష సంస్కారవంతంగా ఉంటుందని భావించారు.. కేటీఆర్ తీరు చూస్తే అధికారం కోసం ఎంత‌కైనా దిగ‌జారుతాడ‌ని అనిపిస్తోందని యెన్నం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. సీఎం కావాల‌ని కేటీఆర్ ఆశ‌ప‌డుతున్నారని, కానీ ఎలా అయ్యేది మాత్రం ఆయ‌నకు తెలియ‌డం లేదన్నారు. ప్రజ‌లు బండ‌కేసి కొడితే భ‌రించ‌లేక సీఎం రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ అవాకులు, చెవాకులు పేలుతున్నారని, ఆయన త‌న జీవితంలో ఒక్క మెట్టు కూడా స్వశ‌క్తి తో ఎద‌గ‌లేదన్నారు. కేటీఆర్ ది బొమ్మరిల్లు ఫాద‌ర్ స్టోరీ అని, కేసీఆర్ వార‌సుడిగానే కేటీఆర్ కు ప‌దవులు వ‌చ్చాయన్నారు. రైతు అంటేనే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటేనే రైతు మేం అక్షరాలు నేర్పిస్తే బీఆర్ఎస్ ఇప్పుడు మాకు సుద్దులు చెపుతోందని యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు క‌రీంన‌గ‌ర్‌లో ప‌ర‌స్పరం దాడులు చేసుకుంటున్నారని, ప‌దేళ్లు బీఆర్ఎస్ పార్టీ అనేక దాడులు చేసిందని యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వ‌స్తే తెలంగాణ‌లో ఎలాంటి ప‌రిస్థితులు వ‌స్తాయో క‌రీంన‌గ‌ర్ ఘ‌ట‌న నిద‌ర్శనమని, తెలంగాణ సుర‌క్షితంగా ఉండాలంటే కాంగ్రెస్ ప్రభుత్వమే శ్రీరామ ర‌క్ష అని ఆయన తెలిపారు.

ఆ పార్టీలు కలిసే ఉన్నాయి : అద్దంకి

కరీంనగర్ లో బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మధ్య కొట్లాట హాస్యాస్పదమని, మీరు కొట్టుకున్న ఆ రెండు పార్టీలు కలిసే ఉన్నాయని శాసన మండలిలో ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి దాడులను ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, ఈ కొట్లాటలతో ఓ కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేయాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలో ఈ దాడుల సంస్కృతి మంచిది కాదని, ప్రజల కోసం మాట్లాడాలి గాని పోట్లాడకూడదన్నారు. మీ ఇద్దరూ ఒకటే అని తెలంగాణ సమాజానికి తెలుసని అద్దంకి దయాకర్ ఆరోపణలు గుప్పించారు.

Next Story