నెల రోజులు దాటినా.. ఎకరానికి రూ. 10 వేల హామీపై నో క్లారిటీ

by Disha Web Desk 4 |
నెల రోజులు దాటినా.. ఎకరానికి రూ. 10 వేల హామీపై నో క్లారిటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 10 వేల చొప్పున సాయాన్ని అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గత నెల 23న ఖమ్మం జిల్లా టూర్ సందర్భంగా హామీ ఇచ్చారు. గంటల్లోనే జీవో విడుదల చేస్తామని ప్రకటించినట్లుగానే పునరావాస కమిషనర్ రాహుల్ బొజ్జా అదే రోజు సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. కానీ ఆర్థిక శాఖ నుంచి మాత్రం ఇప్పటికీ బడ్జెట్‌గానీ, రిలీజ్ ఆర్డర్‌గానీ విడుదల కాలేదు. రాష్ట్రంలో మొత్తం 2.28 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని, ఇందులో 1.29 లక్షల ఎకరాల్లో తీవ్రంగా జరిగిందన్నారు. అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు సమగ్ర నివేదికను పంపాల్సిందిగా కూడా సమాచారం వెళ్ళింది. క్షేత్రస్థాయిలో పంటల నష్టంపై వివరాల సేకరణ కూడా పూర్తయింది. దాదాపు 1.51 లక్షల ఎకరాలకు అవసరమయ్యే రూ. 151 కోట్లను తక్షణం రిలీజ్ చేయాలనే నిర్ణయం జరిగినట్లు తెలిసింది. కానీ ఇప్పటికీ రైతులకు ఆ సాయం అందలేదు.

రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఎస్డీఆర్ఎఫ్ నిధుల నుంచి రైతులకు సాయం అందిస్తామని రాహుల్ బొజ్జా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రం దగ్గర నిధులు ఉన్నట్లు అధికారి మాటల్లో వ్యక్తమవుతున్నా రైతుల ఖాతాల్లో జమ కావకపోవడం గమనార్హం. ముఖ్యమంత్రి ఆశించినంత స్పీడ్‌గా ఈ హామీ అమలుకాలేదు. ఈలోపే మంగళవారం కురిసిన అకాల వర్షాలకు పలు జిల్లాల్లో చేతికొచ్చిన వరి పంటకు భారీగా నష్టం జరిగింది. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం పర్యటించి రైతులతో మాట్లాడారు. కోతకు వచ్చిన వరి పంట నీట మునిగి రైతులకు జరిగిన ఆర్థిక నష్టంపై ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని, కౌలు రైతుల బాధలు వర్ణనాతీతం అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు నిధులే విడుదల కాలేదన్న నిరాశతో ఉన్న రైతులు ఇప్పుడు మంత్రి హరీశ్‌రావు హామీపై ఆశలు పెట్టుకున్నారు.



Next Story

Most Viewed