ప్రధాని మోడీ నాయకత్వంపై ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
ప్రధాని మోడీ నాయకత్వంపై ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీ నాయకత్వంపై బీజేపీ కీలక నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన దేశ ప్రజలు ముక్తకంఠంతో మోడీని మరోసారి ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇవాళ మోడీ ఉద్వేగభరిత ప్రసంగంతో కార్యకర్తల్లో ఉత్తేజం నింపారని అన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సొంతంగానే 370 కి పైగా సీట్లు పొందడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. కాంగ్రెస్‌కు ఇక కేంద్రంలో అధికారం కలే అని విమర్శించారు. మోడీని ఎదుర్కొనే నేత కాంగ్రెస్‌లో లేడని అన్నారు. కాగా, ఇవాళ ఢిల్లీలో నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.

పార్టీకి రాబోయే 100 రోజులు చాలా కీలకమని అన్నారు. ఎన్డీయే సర్కార్‌కు 400 సీట్లు ఖాయమని విపక్షాలు కూడా నినదిస్తున్నాయని చెప్పారు. ఈ వంద రోజులు పార్టీ కార్యకర్తలు కొత్త శక్తి, కొత్త ఉత్సాహం, కొత్త ధీమాతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. గత పదేళ్లలో భారత్ సాధించిన విజయాల గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటోందని, ఇదే విషయాన్ని దేశంలోని ప్రతి ఇంటికి చేరాలని పిలుపునిచ్చారు. బీజేపీ సాధించినవేమీ చిన్న విషయాలు కాదని చెప్పారు. భారతదేశాన్ని అభివృద్ధి పరచాలన్నదే బీజేపీ కల అని అన్నారు. ఈ దిశగా రాబోయే ఐదేళ్లలో చాలా పెద్ద పాత్రను మనం పోషించబోతున్నామని, గతం కంటే ఎన్నో రెట్లు వేగంగా దూసుకుపోయేలా మనం పనిచేయాల్సి ఉంటుందని మోడీ నిర్దేశం చేశారు.


Next Story

Most Viewed