పార్టీ మార్పుపై ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
పార్టీ మార్పుపై ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో బుజ్జగింపుల పర్వం కొనసాగుతున్నది. బండి సంజయ్ మార్పుతో రాష్ట్ర బీజేపీ నేతలు కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్ పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం జరుగుతున్న వేళ చంద్రశేఖర్ నివాసానికి ఈటల రాజేందర్ వెళ్లడం ఆసస్తిగా మారింది.

ఈ సందర్భంగా మాజీ మంత్రితో చర్చించిన ఈటల.. పార్టీ మారే విషయంలో తొందరపాట నిర్ణయం తీసుకోవద్దని సూచించినట్లు సమాచారం. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఈటల పార్టీలు మారడం అంటే బట్టలు మార్చినంత ఈజీ కాదని, చంద్రశేఖర్‌కు మాకు కామన్ ఎజెండా ఉందన్నారు. ఏ,బీ,సీ,డీ వర్గీకరణకు బీజేపీ కమిట్ మెంట్‌తో ఉందని కేసీఆర్‌ను గద్దె దించడంలో కలిసి పని చేస్తామన్నారు. చంద్రశేఖర్ పార్టీ వీడుతారని కొందరు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. పార్టీలో జరుగుతున్న విషయాల పట్ల ఈటలతో చర్చించినట్లు చెప్పారు. రాష్ట్రంలో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి అనే అంశంపై మాట్లాడుకున్నామని ఉద్యమంలో పదవులు త్యాగం చేసి పని చేశామన్నారు. పార్టీ బాగుండాలని కోరుకుంటున్నానన్నారు. కాగా కొంత కాలంగా పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలతో చంద్రశేఖర్ అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం వినిపిస్తున్నది. ఈ క్రమంలో వరంగల్ మోడీ పర్యటనకు ఆయన దూరంగా ఉండటం ఆయన పార్టీ మారుతున్నారనే అనుమానాలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన బీజేపీ ఈటలను బుజ్జగింపులకు పంపినట్లు తెలుస్తున్నది.

Next Story

Most Viewed