పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే: ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు!

by Disha Web Desk 19 |
పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే: ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు!
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో జాయిన్ అవుతారా అని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అధికార బీఆర్ఎస్ నుండి బయటికొచ్చిన ఈ నేతలను తమ పార్టీలోకి లాక్కునేందుకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు గాలం వేస్తున్నాయి. ఈ మాజీ గులాబీ నేతలతో మంతనాలు జరుపుతున్నాయి. ఈ క్రమంలో పొంగులేటి, జూపల్లి కృష్ణారావు చేరికపై హుజురాబాద్ ఎమ్మెల్యే, టీ- బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు బీజేపీ పార్టీలో చేరడమే కష్టమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరాలని పొంగులేటి, జూపల్లి కృష్ణారావును సంప్రదించగా వారు తనకే రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారని చెప్పారు. తాను ప్రతి రోజు వాళ్లతో మాట్లాడుతున్నానని.. అయితే బీజేపీలో చేరేందుకు వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు చర్చలు జరిపి వాళ్లు కాంగ్రెస్‌లో చేరకుండా మాత్రమే ఆపగలిగానని అన్నారు.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అప్పట్లో ప్రియాంక గాంధీని కలుస్తారని వార్తలు రావడంతో అంతకంటే ముందే వెళ్లి ఖమ్మంలో అతడిని కలిశానని తెలిపారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉందని.. బీజేపీ పార్టీ అక్కడ బలంగా లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఖమ్మం ఇప్పటికి కమ్యూనిస్ట్ ఐడీయాలజీ ఉన్న జిల్లా అని.. దేశానికి కమ్యూనిస్ట్ సిద్ధాంతం నేర్పిన గడ్డ తెలంగాణ అని అన్నారు. ఖమ్మంలో వామపక్షాలు, టీడీపీ సహా అన్ని పార్టీల కార్యకర్తలు ఉంటారన్నారు. ఇదిలా ఉంటే, తెలంగాణ బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌గా ఉన్న ఈటల స్వయంగా ఆయనే పొంగులేటి, జూపల్లి కృష్ణారావు బీజేపీలో చేరడమే కష్టమే అని వ్యాఖ్యానించడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.



Next Story

Most Viewed