బీజేపీలో ఈటల దుమారం..! తీరుపై పార్టీలో భిన్న స్వరాలు

by Disha Web Desk 14 |
బీజేపీలో ఈటల దుమారం..! తీరుపై పార్టీలో భిన్న స్వరాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీలో సీనియర్ నేత ఈటల రాజేందర్ దుమారం మరోసారి చెలరేగుతుంది. గతంలో పార్టీలోని నేతల విధానంపై అధిష్టానానికి కంప్లైంట్ ఇచ్చారని, దీంతో బీజేపీ స్టేట్ చీఫ్ పదవి నుంచి బండి సంజయ్ దిగిపోయినట్టు ఆరోపణలు ఉన్న విషయం విదితమే. దీంతో పార్టీలో బండి సంజయ్, ఈటల రాజేందర్, స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి వర్గాలుగా గతంలో చీలికలు వచ్చినట్లు పుకార్లు కూడా వినిపించాయి. తాజాగా ఈటల రాజేందర్ మరో నిర్ణయం వివాదానికి తెర లేపుతున్నట్లు పొలిటికల్ వర్గాల్లో టాక్ నడస్తొంది.

మల్కాజ్‌గిరి ఎంపీకి పోటీ చేసే ప్రయత్నం

అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం మొదలైంది. దీంతో ఈటెల రాజేందర్ దేశంలోనే అతి పెద్ద మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంపై గురిపెట్టారని తెలుస్తోంది. మరోవైపు ఈటలతో పాటు బీజేపీ నుంచి ఆ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయాలని నేతలు క్యూ కడుతున్నారు.

అయితే నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో బీజేపీ అధిష్టానం అభ్యర్థి ఎంపికపై సీనియర్ నేత పైడి రాకేష్ రెడ్డికి పార్లమెంట్ ఇన్చార్జి బాధ్యతలు ఇది వరకే అప్పగించింది. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన ఈటల.. తీవ్ర పోటీ ఉన్న ఈ మల్కాజిగిరి పార్లమెంట్ పైనే గురిపెట్టడంతో పార్టీలోని ఇతర ఆశావాహులకు నచ్చడం లేదు. ఎందుకంటే బీజేపీకి అనుకూలంగా ఉన్న సెగ్మెంట్ కావడంతో.. అధిష్టానం ఈ పార్లమెంట్‌‌లో గెలవాలని భావించి.. ఫోకస్ పెంచింది. ఈ నేపథ్యంలోనే అక్కడే పోటీ చేసేందుకు నేతలు క్యూ కడుతున్నారు. రెండు చోట్ల ఓడిపోయిన ఈటల ఈ స్థానం కాకుండా మెదక్ ఇతర స్థానాల్లో పోటీ చేయాలని ఆయకు పార్టీ నేతలు సంకేతాలు పంపుతున్నట్లు సమాచారం.

మల్కాజ్‌గిరిలోపాగా వేసే ప్రయత్నం

కానీ, ఈటల రాజేందర్ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా మల్కాజ్‌గిరిలోనే పాగా వేసి.. ప్రజలకు చేరువయ్యేందుకు ప్లాన్లు వేస్తున్నారు. వివిధ కార్యక్రమాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ అధిష్టానానికి సంకేతాన్ని పంపుతున్నారు. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేందుకు ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘ఈటల ఫర్ మల్కాజ్‌గిరి’ క్రికెట్ ట్రోఫీని ఆయన అనుచరులు స్టార్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ కూడా స్వయంగా తన నివాసంలో ఈటల రాజేందర్ రిలీజ్ చేశారు. ఈటలకే మల్కాజ్‌గిరి టికెట్ రాబోతున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. దీంతో మరోసారి ఈటల దుమారం తెరపైకి వచ్చింది. ఎంపీగా పోటీపై బీజేపీ అధిష్టానం నిర్ణయం కంటే ముందే అనుచరుల పేరుతో తానే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారని పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయిస్తుందోనన్న చర్చ కాషాయ శ్రేణుల్లో జోరుగా నడుస్తోంది.


Next Story