- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో మూడో విద్యుత్ డిస్కం ఏర్పాటు.. అధికారిక ఉత్తర్వులు విడుదల
తెలంగాణలో కొత్తగా మూడో విద్యుత్ డిస్కం (TGRPDCL) ఏర్పాటైంది. వ్యవసాయం, ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథ విద్యుత్ అవసరాలను ఈ డిస్కం పర్యవేక్షించనుంది.

దిశ, వెబ్డెస్క్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న రెండు విద్యుత్ పంపిణీ సంస్థలకు (TSSPDCL, TSNPDCL) అదనంగా, మూడవ డిస్కంను ఏర్పాటు చేస్తూ బుధవారం అధికారికంగా ఉత్తర్వులు (GO) జారీ చేసింది. ఈ కొత్త సంస్థకు తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGRPDCL) అని పేరు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే, కొత్తగా ఏర్పడిన ఈ డిస్కం బాధ్యతలను ప్రభుత్వం సమర్థవంతమైన అధికారులకు అప్పగించింది. సీనియర్ ఐఏఎస్ అధికారి ముషారఫ్ అలీ ఫరూఖీని ఈ సంస్థకు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా నియమించింది. ఆయనతో పాటు సంస్థ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు మరో నలుగురు డైరెక్టర్లను కూడా ప్రభుత్వం నియమించింది.
TGRPDCL ప్రధాన బాధ్యతలు ఇవే..
ఈ కొత్త డిస్కం కేవలం సాధారణ విద్యుత్ పంపిణీకే పరిమితం కాకుండా, ప్రత్యేకంగా వ్యవసాయం, ప్రజా అవసరాలకు సంబంధించిన విద్యుత్ సరఫరాను పర్యవేక్షించనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల నిర్వహణ, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించనుంది. రైతులు కోరుకునే కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేయనుంది. రాష్ట్రంలోని భారీ, మధ్యతరహా ఎత్తిపోతల (Lift Irrigation) ప్రాజెక్టులకు విద్యుత్ సరఫరా చేయనుంది. ఇక మిషన్ భగీరథ, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, మున్సిపల్ వాటర్ సప్లై స్కీమ్లకు సంబంధించిన విద్యుత్ కనెక్షన్లను ఈ డిస్కం పర్యవేక్షించనుంది.
కాగా, సాధారణ వినియోగదారులు, పరిశ్రమల విద్యుత్ అవసరాల నుంచి వ్యవసాయం భారీ ప్రభుత్వ ప్రాజెక్టుల విద్యుత్ లోడ్ను వేరు చేయడం ద్వారా అడ్మినిస్ట్రేషన్ మరింత సులభతరం అవుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో రైతులకు విద్యుత్ సమస్యలు తలెత్తకుండా వేగంగా పరిష్కారం లభించే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన తర్వాత విద్యుత్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద సంస్కరణల్లో ఇది ఒకటిగా నిలవనుంది.






