గెలిచే ఛాన్స్ లేని చోట భుజానికెత్తుకుంటున్న BRS శ్రేణులు.. బలిచేయనున్నారా?

by Disha Web Desk 2 |
గెలిచే ఛాన్స్ లేని చోట భుజానికెత్తుకుంటున్న BRS శ్రేణులు.. బలిచేయనున్నారా?
X

ఖమ్మం పార్లమెంట్ బరి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ నామ నాగేశ్వరరావు పేరు దాదాపు ఖరారైనా.. జిల్లాలోని ఈక్వెషన్స్ ఆయన్ను టెన్షన్ పెట్టిస్తున్నాయి. పరువుతో బరిలో నిలువాలా? భారంతో వెనక్కుతగ్గాలా? తెలియక తర్జనభర్జన పడుతున్నట్లు ప్రచారం. ఇంతకాలం నామాను దూరం పెట్టిన లోకల్ నాయకులు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆయన్ను ఆకాశానికెత్తడం, తోడుగా ఉంటామని చెప్పడం విస్తుగొలుపుతోంది. ఇంతకీ ఎన్నికల్లో నామాను గెలిపిస్తామని పైకి చెబుతున్నా.. లోలోపల మాత్రం బలిచేస్తారనే వాదన మాత్రం జిల్లా రాజకీయాల్లో చర్చను రేకెత్తిస్తుంది.

దిశ, ఖమ్మం బ్యూరో: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావును ఖరారు చేస్తూ ఈ మధ్య హైదరాబాద్ లో జరిగిన సన్నాహక సమావేశంలో తీర్మానం చేశారు. జిల్లాలోని నాయకులు, ప్రధాన శ్రేణుల నడుమ తీసుకున్న నిర్ణయం మేరకు అధిష్టానం సూచనతో బరిలో నిలువబోతున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇంతకాలం అన్ని విషయాల్లో దూరందూరంగా ఉన్న జిల్లాకు చెందిన కొందరు నేతలు ఇప్పుడు ఎంత వరకు నామాకు సహకరిస్తారన్నదే ప్రశ్నార్థకం. ఎంపీతో నాడు అంటీముట్టనట్లు వ్యవహరించిన మాజీలు ఇప్పుడు నియోజకవర్గాల్లో ఏ మేరకు పనిచేస్తారన్నది అంతుచిక్కని సమస్య.


నాడు వద్దు.. నేడు ముద్దు..

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో ఇన్‌చార్జిని బీఆర్ఎస్ పార్టీ నియమించింది. అందులో భాగంగా ఎంపీ నామాకు మొదట మధిర నియోజకవర్గాన్ని కేటాయించారు. కొంతకాలం పనిచేశాక నాటి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, అభ్యర్థి లింగాల కమల్‌రాజ్ ఒత్తిడి మేరకు ఆ పార్టీ అధిష్టానం నామాను తొలిగించి, ఆ స్థానంలో పువ్వాడకు బాధ్యతలిచ్చినట్లు ప్రచారం జరిగింది. విషయం తెలిసిన నామాఈ పరిణామంతో కంగుతిన్నా.. అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. మిగతా నియోజకవర్గాల్లో బాధ్యులు అక్కడే ఉండి పనిచేసినా.. పువ్వాడ మాత్రం ఒక్కరోజు కూడా ఎన్నికల సమయంలో మధిరలో పర్యటించకపోవడం విశేషం. తీరా ఎన్నికలకు రెండు రోజుల ముందు మధిర అభ్యర్థి లింగాల కమల్ రాజ్ విడుదల చేసిన వీడియో రాష్ట్రవ్యాప్తంగా సంచలమైంది. హైదరాబాద్ లో జరిగిన పార్లమెంట్ సన్నాహక సమావేశంలో లింగాల కమల్ రాజ్‌కే కేటీఆర్ క్లాస్ పీకిన విషయం తెలిసిందే.

నియోజకవర్గాల్లో అవసరమైతేనే..

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు నాటి మంత్రి సూచనల మేరకే నడుచుకున్నారు. పైకి అందరూ సఖ్యతగా కనిపించినా లోలోపల మాత్రం అగ్ని పర్వతంలోని లావాలా ఉండేవారు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో పర్యటించేందుకు ఎంపీకి మాత్రం అనుమతి ఉండేది కాదు. తనకు తెలియకుండా, తాను రాకుండా ఎంపీ విడిగా పర్యటించేందుకు అజయ్ ఒప్పుకునేవారు కాదని ఓడిన కొందరు ఎమ్మెల్యేలే బాహాటంగానే చెబుతున్నారు. షెడ్యూల్ ఖరారు అయిన కార్యక్రమాలు సైతం రద్దు చేసుకున్న సందర్భాలు ఉన్నాయని గుర్తుచేసుకుంటున్నారు. ఒకే సామాజిక వర్గం అయినా అంతర్గతంగా అనేక విషయాల్లో వీరి మధ్య బేధాభిప్రాయం ఉన్నదని టాక్.

పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో..

ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాలుండగా.. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల బీఆర్ఎస్ అభ్యర్థులందరూ ఓటమి పాలయ్యారు. ఊహించని రీతిలో ప్రజలు షాక్ ఇచ్చి భద్రాచలానికి మాత్రమే పరిమితం చేశారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థికి ఏ మేరకు ప్రజలు సహకరిస్తారన్నది చూడాలి. కాంగ్రెస్ మాత్రం ఇప్పటినుంచే పార్లమెంట్ ఎన్నికలపై గ్రౌండ్ వర్క్ రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. గ్రామస్థాయినుంచి క్యాడర్‌ను బలోపేతం దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది.

కాంగ్రెస్ సునామీలో కష్టమే..

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పార్టీ రోజురోజుకూ బలపడతోంది. గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసేందుకు జిల్లా నాయకులు ఎప్పటికప్పుడు కసరత్తు చేస్తున్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్‌గా ఉన్నా.. కాంగ్రెస్ అభ్యర్థి గెలిచేందుకే ఎక్కువ అవకాశాలున్నాయని రాజకీయవాదులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ అధిష్టానానికి ఈ విషయం మీద స్పష్టమైన అభిప్రాయం ఉన్నా.. పోటీలో లేకపోతే ప్రజల్లోకి నెగేటివ్ సంకేతాలు వెలుతాయని, నామ తప్ప మరో అభ్యర్థి బరిలో నిలిచే సాహసం ఎవరూ చేయలేరని టాక్. అందుకే సిట్టింగ్ అయిన నామాకే అవకాశం కల్పించారు. అయితే జిల్లా నాయకులంతా ఏకతాటిపై నడిచి నామకు సహకరిస్తారా? లేదా చేతులెత్తేస్తారా? అన్నది చూడాల్సిందే.



Next Story

Most Viewed