పర్యావరణ రక్షణ: స్కూల్ నుంచే ‘గ్రీన్’ అడుగులు!

by Vemula.Srinu Prasad |

పాఠ‌శాల విద్యార్థుల్లో పర్యావరణ చైతన్యం పెరగాలని... పర్యావరణ పరిరక్షణకు అవగాహనే తొలి అడుగు అని తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీ డైరెక్టర్, సీసీఎఫ్ డా. ప్రియాంకా వర్గీస్ పేర్కొన్నారు...

పర్యావరణ రక్షణ: స్కూల్ నుంచే ‘గ్రీన్’ అడుగులు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: పాఠ‌శాల విద్యార్థుల్లో పర్యావరణ చైతన్యం పెరగాలని... పర్యావరణ పరిరక్షణకు అవగాహనే తొలి అడుగు అని తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీ డైరెక్టర్, సీసీఎఫ్ డా. ప్రియాంకా వర్గీస్ పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం-2026 సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీ (టీజీఎస్‌ఎఫ్‌ఏ) ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణ, వాతావరణ మార్పులపై విద్యార్థుల్లో చైతన్యం కల్పించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీ డైరెక్టర్, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (సీసీఎఫ్) డా. ప్రియాంకా వర్గీస్ మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడాలంటే చిన్న వయస్సు నుంచే విద్యార్థుల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రకృతి పట్ల బాధ్యతాయుతమైన దృక్పథాన్ని అలవర్చుకుని, పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం-2026 సందర్భంగా పర్యావరణ అవగాహన వీడియోల ప్రదర్శన, ఉపన్యాస పోటీలు, పాములపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 14 పాఠశాలల నుంచి సుమారు 120 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడవులు, వన్యప్రాణులు, జీవ వైవిధ్యం, ప్రకృతి సమతుల్యత పరిరక్షణ ప్రాధాన్యంపై విద్యార్థులకు వివరించారు.

డా. ప్రియాంకా వర్గీస్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కాలుష్యం, జీవ వైవిధ్యం తగ్గిపోవడం వంటి సమస్యలు తీవ్ర సవాళ్లుగా మారాయని అన్నారు. సహజ వనరుల పరిరక్షణ కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు తన వంతు బాధ్యత నిర్వర్తించాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు ప్రకృతి సంరక్షణలో ముందుండాలని పిలుపునిచ్చారు. అటవీ అకాడమీ అధ్యాపకులు కూడా విద్యార్థులతో మమేకమై పర్యావరణ విద్య ప్రాముఖ్యతను వివరించారు. పచ్చని, పరిశుభ్రమైన, స్థిరమైన భవిష్యత్తు నిర్మాణంలో పర్యావరణ అవగాహన కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ముగింపులో విద్యార్థులు మొక్కలు నాటడం, నీటిని పొదుపుగా వినియోగించడం, వ్యర్థాలను తగ్గించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి చర్యల ద్వారా ప్రకృతి పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు

Next Story