‘స్థానిక’ ఎన్నికల ఇష్యూకు ఎండ్ కార్డు..! నేడు హైకోర్టులో విచారణ

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-24 01:34:48  IST  )

స్థానిక సంస్థల ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడే అవకాశం ఉంది.

‘స్థానిక’ ఎన్నికల ఇష్యూకు ఎండ్ కార్డు..! నేడు హైకోర్టులో విచారణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణపై నేడు హైకోర్టులో విచారణ జరగనున్నది. గతంలో విచారణ సమయంలో ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం కావాలని ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం లేఖ ఇచ్చింది. రిజర్వేషన్లు, సన్నద్ధతను వ్యక్తం చేస్తూ ప్రభుత్వం లేఖ ఇవ్వగానే ఎన్నికల సంఘం సైతం తామూ ఎలక్షన్స్ నిర్వహించేందుకు రెడీగా ఉన్నామని కోర్టుకు తెలిపింది. దీంతో నేటి విచారణలో కోర్టు ఏ విధంగా స్పందిస్తుందనే ఆసక్తి నెలకొంది.

50 రిజర్వేషన్లతో..

50 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇప్పటికే సూచించింది. ఈ నేపథ్యంలో కోర్టు సైతం వెంటనే ఎన్నికల నిర్వహణపై నేటి విచారణలో సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. మరోవైపు ఎన్నికలు నిర్వహించాలని, 15వ ఆర్థిక సంఘం నిధులు సాధించాలని ప్రభుత్వం పట్టుదలతో ఉన్నది. ఇప్పటికే గ్రామ పంచాయతీల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 50 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం జీవో జారీ చేసింది. దానికి అనుగుణంగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. గతంలో 42 శాతం బీసీలకు కేటాయించిన రిజర్వేషన్లలో తాజాగా మార్పులు జరిగాయి. కొత్త జాబితాలో బీసీలకు సీట్లు తగ్గి జనరల్​స్థానాలు పెరిగాయి. మహిళా సీట్లు సైతం కాస్త మారాయి. మహిళా రిజర్వేషన్లను లాటరీ విధానంలో ఖరారు చేసి గెజిట్‌ను ఆదివారం ప్రచురించారు. అదే రోజు రాత్రి గెజిట్‌లను రాష్ట్ర పంచాయతీరాజ్​కమిషనర్​కార్యాలయంలో అందించారు. వాటిని నేటి హైకోర్టు నిర్ణయం అనంతరం సాయంత్రం కల్లా ఎన్నికల కమిషన్‌కు అందించే అవకాశం ఉందని అధికార వర్గాల ద్వారా తెలిసింది. గెజిట్‌లతో పాటు ఎన్నికలకు సన్నద్ధతను వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ ఇవ్వనుంది. అనంతరం ఎన్నికల సంఘం షెడ్యూల్​విడుదల చేయనుంది.

26 లేదా 27న షెడ్యూల్..!

ఈ నెల 25న రాష్ట్ర కేబినెట్​సమావేశం ఏర్పాటు చేశారు. అందులో తీసుకున్న నిర్ణయం ఆధారంగా 26 లేదా 27 తేదీల్లో ఎన్నికల షెడ్యూల్​విడుదలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. డిసెంబర్​11న మొదటి విడత ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, 15న, 19న వరుసగా విడుతల వారీగా (మూడు) ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సమాచారం. ఇందుకు అనుగుణంగా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నదని తెలిసింది. సర్పంచ్ ​ఎన్నికలను క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు ఐఏఎస్ ​అధికారులను జిల్లా ఎన్నికల పరిశీలకులుగా ఎలక్షన్ కమిషన్ నియమించింది. ఈ నేపథ్యంలో వీరికి సోమవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సాధారణ పరిశీలకులు, వ్యయ పరిశీలకులకు అవగాహన కల్పించనున్నారు. వీరు ఎలక్షన్ షెడ్యూల్​ విడుదలైన అనంతరం జిల్లాలకు వెళ్లి ఎన్నికల ప్రక్రియను పరిశీలిస్తారు. రెండు, మూడు గ్రామాలకు కలిపి ఒక రిటర్నింగ్​ అధికారిని నియమించారు. వీరు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఆదివారం వార్డుల వారీగా తుది ఓటరు జాబితాను ప్రకటించారు. మరోవైపు రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు.

Next Story