మిగతా హామీలకు ఒట్టెప్పుడు?.. సీఎం రేవంత్‌కు బీజేఎల్పీ నేత ఏలేటి లేఖ

by Prasad Jukanti |
మిగతా హామీలకు ఒట్టెప్పుడు?.. సీఎం రేవంత్‌కు బీజేఎల్పీ నేత ఏలేటి లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టి ఆరు నెలలు గడిచిపోయినా ఇచ్చిన హామీలను ఇప్పటివరకు నెరవేర్చలేదని బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ఆరు గ్యారెంటీలతో పాటు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారంటూ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఇవాళ బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రుణమాఫీపై సీఎం ఒట్టు పెట్టుకున్నారని, మిగతా హామీలకు ఎప్పుడు ఒట్టు పెడతారని ప్రజలు ఎదురుచూస్తున్నారని సెటైర్ వేశారు. సివిల్ సప్లై ఇష్యూలో గవర్నర్‌తో పాటు కేంద్ర హోంమంత్రిని కలిసి సీబీఐ ఎంక్వయిరీ చేయాలని కోరుతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో మునిగిపోయిందని, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ 8 ఎంపీలను గెలుచుకుంటే.. 63 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం 8 ఎంపీ సీట్లను గెలుచుకుని ప్రజాగ్రహానికి గురైందన్నారు. ఎంపీ ఎన్నికలను తమ పాలనకు రెఫరెండం అని చెప్పిన ముఖ్యమంత్రి.. 14 స్థానాలు గెలవనందుకు నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ‘విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు ఇస్తామన్నారు. ఫించన్లు రూ.4 వేలకు పెంచుతామన్నారు. 18 ఏళ్లు దాటిన విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామన్నారు? వీటిని ఎప్పుడు అమలు చేస్తారు’ అని ప్రశ్నించారు. ఫిబ్రవరిలోనే గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్లు ఇస్తామన్నారు.. ఇచ్చారా? అని నిలదీశారు.



Next Story

Most Viewed