విద్యుత్ వినియోగంలో ఆల్ టైం రికార్డు.. మరింత పెరిగే అవకాశం

by Disha Web Desk 2 |
విద్యుత్ వినియోగంలో ఆల్ టైం రికార్డు.. మరింత పెరిగే అవకాశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి ప్రారంభంలోనే ఎండలు మండుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిలోని విద్యుత్​డిమాండ్ ఆల్​టైం రికార్డు స్థాయికి చేరుకుంది. ఏకంగా గతేడాది విద్యుత్​డిమాండ్​రికార్డులను బ్రేక్ చేసేంతలా వినియోగం పెరిగింది. గత శుక్రవారం 13,539 మెగావాట్ల విద్యుత్‌ను వినియోగదారులు వాడుకున్నారు. వేసవి ప్రారంభంలోనే ఈ పరిస్థితి ఉంటే, రాను రాను ఎండలు ముదిరే కొద్దీ వినియోగం మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఈ వేసవిలో దాదాపు 14 వేల మెగావాట్లకు పైగా విద్యుత్ వినియోగించుకునే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఇబ్బందులను అధిగమించేలా విద్యుత్​శాఖ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

గతేడాది మార్చి 4వ తేదీన 13,221 మెగావాట్ల విద్యుత్‌ను వినియోగదారులు వాడుకున్నారు. అప్పటి వరకు ఇదే ఆల్​టైం రికార్డుగా ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత మేర వినియోగం ఎన్నడూ సాధ్యం కాలేదు. కేవలం తెలంగాణలోనే 13,221 మెగావాట్ల డిమాండ్‌ను అధిగమించడం రికార్డుగా చెప్పుకున్న విద్యుత్ శాఖ అధికారులు తాజాగా 13,539 మెగావాట్లకు చేరుకోవడం రికార్డులను బ్రేక్​చేశాయని చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2014 మార్చి 23న అత్యధికంగా 13,162 మెగావాట్ల విద్యుత్​డిమాండ్​నమోదు కాగా, ఇప్పుడు కేవలం తెలంగాణలోనే ఇంత భారీ స్థాయిలో నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఒకటిన్నర కోట్ల మంది విద్యుత్​కనెక్షన్​తీసుకున్నారు. కాగా ఈ వేసవిలో అవాంతరాలను అధిగమించేందుకు పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టం చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అందుకోసం విద్యుత్ వాడకానికి అనుగుణంగా పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టపరిచేందుకు అదనంగా ఫీడర్లు, ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ భావిస్తోంది. ఇదిలా ఉండగా ఈ వేసవిలో 14 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం దాటే అవకాశం ఉండటంతో దాదాపు 15 మెగావాట్లకు పైగా విద్యుత్ వినియోగాన్ని రాష్ట్రవ్యాప్తంగా అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు స్పష్టం చేశారు.

కొవిడ్‌తో గతేడాది చాలా వరకు పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో పరిశ్రమల్లో విద్యుత్​వినియోగం తగ్గింది. గృహావసరాల వినియోగం విపరీతంగా పెరిగింది. కాగా, ఈ సారి కొవిడ్ ఉధృతి తగ్గిపోవడం, ఆంక్షలు లేకపోవడంతో కరెంట్​వాడకం భారీగా పెరిగే అవకాశాలున్నాయి. గతేడాది మార్చిలో వినియోగం అత్యధికంగా 57 మిలియన్‌ యూనిట్లు నమోదైంది. అయితే ఎస్పీడీసీఎల్​పరిధిలో మొత్తం పీక్‌ హవర్‌ డిమాండ్‌ దాదాపు 7,500 మెగావాట్లకు చేరింది. అందులో గ్రేటర్‌ పరిధిలోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో 3500 మెగావాట్ల నుంచి మొదలుకొని 3700 మెగావాట్ల వరకు నమోదు కావడం గమనార్హం. గత రెండేళ్లు గ్రేటర్​హైదరాబాద్‌లో కొవిడ్​దృష్ట్యా విద్యుత్​డిమాండ్​తగ్గింది. అయితే ఈ సారి ఎలాంటి కొవిడ్​ఆంక్షలు లేకపోవడంతో గ్రేటర్‌ పరిధిలో అన్నిరకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు, పరిశ్రమలు పూరిస్థాయిలో పనిచేస్తున్నాయి. కాబట్టి విద్యుత్‌ డిమాండ్​పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విద్యుత్​శాఖ అధికారులు చెబుతున్నారు.



Next Story

Most Viewed