స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై వారంలో మూడు రోజులు ‘‘ఎగ్’’

by Disha Web Desk 19 |
స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై వారంలో మూడు రోజులు ‘‘ఎగ్’’
X

దిశ, తెలంగాణ బ్యూరో: పీఎం పోషణ్‌లో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించే మిడ్ డే మీల్స్ మెనూ ఫిక్స్ చేసి, మీల్స్‌కు అయ్యే ఖర్చు కేంద్ర, రాష్ట్ర వాటాలను రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భోజన పథకానికి సంబంధించి ఏజెన్సీ నిర్వాహకులకు చెల్లించే ధరలను ప్రకటించింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన శనివారం అన్ని జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, డీఈవోలకు ఉత్తర్వుల్లో తెలిపారు. ఈ నెల 12వ తేదీ నుంచి తెలంగాణలో పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు నుంచి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

60 శాతం కేంద్ర నిధులు

‘మిడ్ డే మీల్స్’ పథకం పీఎం పోషణ్‌లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పెట్టే భోజనానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు ఇలా ఉన్నాయి. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యార్థుల మీల్స్ ఖర్చు 60 శాతం కేంద్రం నిధులు ఇస్తుంది. 40 శాంత రాష్ట్రం నుంచి నిధులు కేటాయిస్తుంది. తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు 100 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది.

రోడు విడిచి రోజు గుడ్డు

భోజన పథకానికి సంబంధించి ఏజెన్సీ నిర్వాహకులకు చెల్లించే ధరలు ఇలా ఉన్నాయి. ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు ఒక్కో విద్యార్థికి రోజూ రూ.5.45 ఖర్చు చేయనున్నారు. ఎనిమిదో తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.8.17 చెల్లించనున్నారు. తొమ్మిది, పదో తరగతి విద్యార్థికి గుడ్డుతో కలిపి రూ.10.67 ప్రభుత్వం చెల్లించనున్నది. పథకంలో భాగంగా అన్ని తరగతుల విద్యార్థులకు సోమవారం, బుధవారం, శుక్రవారాల్లో మూడు రోజులు గుడ్డు అందించనున్నారు. గురువారం ఒక్క రోజు మాత్రం వెజిటెబుల్ బిర్యానీ విద్యార్థులకు పెట్టనున్నారు.


Next Story

Most Viewed