తెలంగాణలో లీకేజీల జాతర నడుస్తోంది: బండి సంజయ్

by Disha Web Desk 7 |
తెలంగాణలో లీకేజీల జాతర నడుస్తోంది: బండి సంజయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ ప్రభుత్వంలో పరీక్షల లీకేజీ సర్వసాధారణంగా మారినట్లు కన్పిస్తొందని, తెలంగాణలో పరీక్షలు వస్తే లీకేజీల జాతర నడుస్తోందని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్రంలో పదవ తరగతి తెలుగు పేపర్ లీకేజీ కావడం అత్యంత దురదృష్టకరమని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని చేతగాని ప్రభుత్వం ఇంకా కొనసాగుతుండటం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ చేతగానితనం వల్ల విద్యార్థుల జీవితాలకు శాపంగా మారిందన్నారు. కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ యాజమాన్యాలకు ప్రభుత్వం తొత్తుగా మారి ఇలాంటి నీచపు చర్యలకు పాల్పడుతున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయని స్పష్టంచేశారు. ఈ లీకేజీతో ప్రభుత్వ, చిన్న చిన్న ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడిందని పేర్కొన్నారు.

టెక్నాలజీని పేపర్ లీకేజీ కోసం ఉపయోగించుకుంటున్నా నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పేపర్ లీకేజ్‌కి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు విద్యార్థుల జీవితాలను దెబ్బతీస్తున్నాయని, టెన్త్ పరీక్షలు 90 శాతం సిలబస్ తో ఒకే పేపర్‌గా పరీక్ష నిర్వహించడంవల్ల విద్యార్థుల్లో ఇప్పటికే ఒత్తిడి కన్పిస్తొందని తెలిపారు. ఈ లికేజ్ ఘటనతో విద్యార్థుల్లో మరింత గంధరగోళం నెలకొందని వివరించారు. మిగిలిన పరీక్షలైనా ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు రాసేలా పకడ్బందీగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, విద్యార్థులంతా టెన్షన్‌కు గురికాకుండా దైర్యంగా పరీక్షలకు ప్రిపేర్ కావాలని సూచించారు. 10వ తరగతి తెలుగు పేపర్ లీకేజీ పై న్యాయ నిపుణులతో చర్చించి విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఈ లీకేజీ వెనకాల ఎంతటి వారున్నా వదిలి పెట్టవద్దని, బాద్యులైన వారందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Also Read..

మంత్రి సబిత రాజీనామా చేయాలె.. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్

Next Story