హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఈడీ దాడులు.. రూ.60 కోట్ల లావాదేవీలు

by Ramesh Naini |   (  Updated:2025-11-24 16:24:05  IST  )

హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఈడీ దాడులు నిర్వహించింది.

హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఈడీ దాడులు.. రూ.60 కోట్ల లావాదేవీలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఈడీ దాడులు నిర్వహించింది. జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కార్యాలయాలపై, మేనేజింగ్ డైరెక్టర్ కాకర్ల శ్రీనివాస్, దాని అనుబంధ సంస్థలపై డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ) హైదరాబాద్ జోనల్ కార్యాలయ అధికారులు సోదాలు నిర్వహించినట్లు సోమవారం ప్రకటనలో పేర్కొన్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఎనిమిది చోట్ల సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. అనుబంధ సంస్థలుగా ఉన్నా జనప్రియ గ్రూప్, రాజా డెవలపర్స్ బిల్డర్స్, ఆర్.కే. రమేష్, సత్య సాయి ట్రాన్స్‌పోర్ట్, శ్రీ గాయత్రి హోమ్స్, శివ సాయి కన్స్ట్రక్షన్ పై సోదాలు చేసినట్లు వెల్లడించారు.

తెలంగాణ పోలీసులు నమోదు చేసిన పలు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ప్రీ-లాంచ్ స్కీమ్‌ల ద్వారా గృహ కొనుగోలుదారుల నుంచి రూ. 60 కోట్లు మోసపూరితంగా వసూలు చేసిందని తెలిపారు. కొనుగోలు దారులకు ఫ్లాట్‌లను ఇవ్వడంలో, డబ్బు తిరిగి చెల్లించడంలో విఫలమైందని పేర్కోన్నారు. జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించిన డిజిటల్ ఎక్యుప్మెంట్ స్వాధీన పరచుకున్నట్లు, బ్యాంక్ ఖాతాలను కూడా సీజ్ చేసినట్లు తెలిపారు. ప్రధాన నిందితుడుగా పేర్కోన్న కాకర్ల శ్రీనివాస్‌ను గతంలో హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ చేయగా బెయిల్‌పై విడుదల అయి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పేర్కోన్నారు. ఈ కేసులో మిగతా నిందితులను గుర్తించేందుకు తదుపరి దర్యాప్తు జరుగుతుందని పేర్కొన్నారు.

Next Story