కవితకు ఈడీ నోటీసులు: రంగంలోకి కేంద్ర నిఘా బలగాలు

by Disha Web Desk 4 |
కవితకు ఈడీ నోటీసులు: రంగంలోకి కేంద్ర నిఘా బలగాలు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కేంద్ర నిఘా వర్గాలు అప్రమత్తమయ్యయి. కవితను అరెస్టు చేయటం ఖాయమన్న వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అదే జరిగితే తెలంగాణలో పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి? అన్న దానిపై సెంట్రల్​ఇంటెలిజెన్స్​వర్గాలు సమాచారాన్ని సేకరిస్తున్నాయి.

ఎప్పటికప్పుడు నివేదకలను కేంద్రానికి పంపిస్తున్నాయి. ఈ నివేదికల ఆధారంగా ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే ఎలా ఎదుర్కోవాలన్న వ్యూహాలను కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్నట్టు సమాచారం. శాంతిభద్రతల పరిరక్షణ కోసమంటూ కేంద్ర పారా మిలటరీ బలగాలను రంగంలోకి దింపాలని భావిస్తున్నట్టు తెలియవచ్చింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్​స్కాం ప్రస్తుతం తెలంగాణను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. దీనికి కారణం సాక్షాత్తు సీఎం కేసీఆర్ కూతురు కవిత పేరు ఇందులో వినిపిస్తుండటం. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన అరుణ్​రామచంద్రన్​పిళ్లై తాను కవితకు ప్రతినిధిగానే ఈ వ్యవహారంలో పాలు పంచుకున్నట్టు ఈడీ అధికారుల విచారణలో వెల్లడించాడు.

ఇదే విషయాన్ని ఈడీ అధికారులు అరుణ్​రామచంద్రన్​పిళ్లైని మంగళవారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచినపుడు న్యాయస్థానానికి తెలియచేశారు. ఈ క్రమంలోనే విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ అధికారులు తాజాగా కవితకు నోటీసులు జారీ చేశారు. ఇది రాష్ర్టవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఒకవైపు ఈనెల ‌‌10న మహిళా బిల్లు అంశంపై కవిత ఢిల్లోలోని జంతర్​మంతర్​వద్ద ధర్నా జరపాలని నిర్ణయించుకోగా దానికి సరిగ్గా ఒకరోజు ముందు విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇవ్వటం చర్చనీయాంశమైంది.

నోటీసులపై..

కాగా, కవితకు ఈడీ ఇచ్చిన నోటీసులపై ప్రధానంగా బీఆర్‌ఎస్​వర్గాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందునే ఇలా చేస్తున్నారంటూ ఆ పార్టీకి చెందిన నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్​రావు మినహా దాదాపుగా అందరు నాయకులు ఈడీ నోటీసులు ఇవ్వటాన్ని నిరసించారు. కవిత కూడా అరెస్టు చేస్తే చేయనివ్వండి..

ప్రజాక్షేత్రంలో నిర్ణయించుకుంటామని వ్యాఖ్యానించారు. అదే సమయంలో లిక్కర్​స్కాంలో తదుపరి అరెస్టు కవితదే అన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అదే జరిగితే తెలంగాణలో తలెత్తే పరిణామాలను అంచనా వేయటానికి కేంద్ర ప్రభుత్వం సెంట్రల్​ఇంటెలిజెన్స్​వర్గాలను రంగంలోకి దింపింది. కవితను అరెస్టు చేస్తే తెలంగాణలో ప్రధానంగా ఎక్కడెక్కడ ఆందోళనలు బలంగా జరగవచ్చు? నిరసనల సందర్భంగా ఎలాంటి పరిణామాలు తలెత్తవచ్చు? ఏయే నాయకులు ఈ విషయంలో ఎక్కువగా చొరవ చూపించే అవకాశాలున్నాయి? ప్రగతి భవన్‌లో కవితకు నోటీసుల అంశంపై చర్చలేం జరుగుతున్నాయి? అన్నదాంతోపాటు మరిన్ని వివరాలను ప్రస్తుతం కేంద్ర నిఘా వర్గాలు సేకరిస్తున్నాయి.

కవిత నివాసం వద్ద కూడా సెంట్రల్​ఇంటెలిజెన్స్​సిబ్బంది రంగంలో ఉన్నట్టు సమాచారం. సేకరిస్తున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు సెంట్రల్​ఇంటెలిజెన్స్​వర్గాలకు పంపుతున్నట్టు ఇక్కడి ఓ అధికారి చెప్పారు. ఆయా రాష్ర్టాల్లో జరిగే పరిణామాలపై కేంద్ర నిఘా వర్గాలు కన్నేసి పెట్టటం సర్వ సాధారణమే అని చెప్పారు. అయితే, ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ వాతావరణం బాగా వేడెక్కి ఉన్న నేపథ్యంలో ఇక్కడ మరింతగా దృష్టిని కేంద్రీకరించామని వివరించారు. బీఆర్‌ఎస్‌కు చెందిన అందరు అగ్రనాయకుల కదలికలపై కన్నేసి పెట్టినట్టు చెప్పారు. తమ నివేదికల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని తెలిపారు.


Next Story