దుబాయ్ పర్యటన విజయవంతం.. హైదరాబాద్‌కు చేరుకున్న సీఎం చంద్రబాబు

by Kema Shiva Kumar |

రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు 3 రోజుల దుబాయ్ పర్యటన విజయవంతంగా ముగిసింది.

దుబాయ్ పర్యటన విజయవంతం.. హైదరాబాద్‌కు చేరుకున్న సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు 3 రోజుల దుబాయ్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ మేరకు ఇవాళ సీఎం చంద్రబాబు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ టూర్‌లో భాగంగా సీఎం చంద్రబాబు బృందం ప్రముఖ వ్యాపారవేత్తలు, యూఏఈ మంత్రులతో మొత్తం 25 కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. గల్ఫ్‌ దేశాల్లో ప్రవాసాంధ్రులతోనూ వారు సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. అదేవిధంగా నవంబర్ 14, 15న విశాఖపట్నం వేదికగా జరగబోతున్న CII ఇన్వెస్టర్స్‌ మీట్‌-2025 ఆహ్వానించారు. దుబాయ్ పర్యటనలో భాగంగా తొలి రోజు సోభా గ్రూప్ వ్యవస్థాపకుడు పీఎన్‌సీ మెనాన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమరావతి రాజధాని అభివృద్ధి, పర్యాటకం, రియల్‌ ఎస్టేట్, హాస్పిటాలిటీ రంగాల్లో పెట్టుబడుల అవకాశాల గురించి చర్చించారు. ఈ సమావేశంలోనే మెనాన్ అమరావతిలో ప్రపంచస్థాయి లైబ్రరీ నిర్మాణానికి రూ.100 కోట్లు విరాళం ప్రకటించారు. సీఎం అనంతరం వారిని సీఐఐ సమ్మిట్‌కు హాజరుకోవాలని ఆహ్వానించారు. ఆ తర్వాత షరఫ్ గ్రూప్ వైస్‌ చైర్మన్ షరఫుద్దీన్ షరఫ్‌తో లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ సౌకర్యాలపై చర్చించారు. హింద్ టెర్మినల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా రైల్వే, పోర్టు కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో వేర్‌హౌసులు ఏర్పాటు చేయడానికి వారు ఆసక్తి చూపారు. సీఎం, రాయలసీమలో ఆటోమొబైల్ రంగాన్ని ప్రోత్సహించేందుకు పాలసీలు మార్చడానికి సిద్ధంగా ఉన్నామని వారిక వివరించారు.ఇక ట్రాన్స్‌వరల్డ్ గ్రూప్ చైర్మన్ రమేష్ రామకృష్ణతో పోర్టుల అభివృద్ధి, షిప్ మేనేజ్‌మెంట్ వంటి సాగర సంబంధిత అవకాశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. మధ్యాహ్నం, దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియం (మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్) సందర్శించి, భవిష్యత్ ఆవిష్కరణలు, టెక్నాలజీ అభివృద్ధి గురించి అధ్యయనం చేశారు. అనంతరం సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ రోడ్‌షోలో ప్రసంగించారు.

ఆయిల్ కంపెనీ అధికారులతో భేటీ

రెండో రోజు అబుదాబీలో వాణిజ్య చర్చలు, డయాస్పోరా సమావేశమయ్యారు. అబుదాబీ చేరుకున్న సీఎం, అబుదాబీ చాంబర్ ఆఫ్ కామర్స్ అధికారులు, అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ (ADNOC) సీనియర్ అధికారులతో భేటీ అయ్యారు. అక్కడ పారిశ్రామిక, టెక్నాలజీ కంపెనీలతో బిలాటరల్ ట్రేడ్, ఏఐ ఆధారిత సిటిజన్ సర్వీసెస్, ఫుడ్ సెక్యూరిటీ, లాజిస్టిక్స్, రవాణా, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడులపై సమగ్రంగా చర్చించారు. రతన్ తాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH), దుబాయ్ సిలికాన్ ఓయాసిస్ మధ్య ఏఐ డ్రైవెన్ స్టార్టప్‌లకు భాగస్వామ్యాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు లె మెరిడియన్ హోటల్‌లో తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో ప్రసంగించారు. యూఏఈలో ఉండే తెలుగు వారిని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.

టూరిజం, ఇన్ఫ్రాస్ట్రక్చర్‌పై ఫోకస్..

మూడో రోజు దుబాయ్ టూరిజం పాలసీపై అధ్యయనం చేశారు. అబుదాబీలోని వైఎస్ ఐలాండ్‌ను సీఎం చంద్రబాబు బృందం సందర్శించింది. ఫెరారీ వరల్డ్, వైఎస్ వాటర్‌ వరల్డ్, వార్నర్ బ్రోస్ వరల్డ్, సీ వరల్డ్ అబుదాబీ వంటి టూరిజం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను పరిశీలించి, ఏపీలో ఇలాంటి ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బిజినెస్ రౌండ్ టేబుల్ మీటింగ్‌లో పాల్గొని టూరిజం రంగంలో పెట్టుబడులు పెట్టాలని అక్కడి ప్రముఖులను కోరారు. చివరగా మొదటి సాంప్రదాయిక రాతి హిందూ ఆలయం అయిన అబుదాబీలోని బాపస్ హిందూ మందిర్‌ను సీఎం చంద్రబాబు టీమ్ సందర్శించారు.

Next Story