మందుబాబుల భరతం పడుతున్న పోలీసులు

by Disha Web Desk 12 |
మందుబాబుల భరతం పడుతున్న పోలీసులు
X

దిశ తెలంగాణ క్రైం బ్యూరో: ఫుల్‌గా మందు కొట్టి అర్ధరాత్రి దాటాక వెళితే పోలీసులు పట్టుకొరనుకుంటున్నారా?.. అయితే ఇకపై మీ పప్పులు ఉడకవ్. మందుబాబుల కారణంగా అర్ధరాత్రుళ్లు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతుండటంతో ట్రాఫిక్ పోలీసులు దీనిపై ఫోకస్ పెట్టారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము 3 గంటల వరకు నిర్ధిష్టంగా గుర్తించిన ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవింగ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీనికోసం స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందానికి ఇన్స్పెక్టర్ లేదా సబ్ ఇన్స్పెక్టర్ నేత్రుత్వం వహిస్తారు. ముఖ్యంగా హోటళ్లు, బార్లు, పబ్బులు ఉన్న ప్రాంతాల్లో, తరచూ ప్రమాదాలు జరుగుతున్న చోట్ల ఇప్పటికే తనిఖీలు జరుగుతున్నాయి.

పోలీసులపై ఆరోపణలు రాకుండా ఉండటానికి తనిఖీలను వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. దీనివల్ల ఎవరైనా పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే వారిపై కేసులు పెట్టడానికి ఫుటేజీని ఉపయోగిస్తున్నారు. జనవరి నుంచి ఇప్పటివరకు తనిఖీల్లో 13,431 మంది మందుబాబులను పట్టుకున్నారు. వీరిలో 1,317 మందికి ఒక రోజు నుంచి వారం రోజుల వరకు జైలు శిక్షలు పడ్డాయి. ట్రాఫిక్ పోలీసుల నివేదికలతో ఆర్టీవో అధికారులు 243 మంది డ్రైవింగ్ లైసెన్సులను సస్పెండ్ చేశారు.53 మంది లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేశారు. జరిమానాల రూపంలో 3 కోట్ల 21 లక్షల 39 వేల రూపాయలు వసూలు చేశారు.



Next Story

Most Viewed