అధికారుల తీరుపై డౌట్..! సీఎంఆర్ రికవరీ అయ్యేనా?

by Disha Web Desk 4 |
అధికారుల తీరుపై డౌట్..! సీఎంఆర్ రికవరీ అయ్యేనా?
X

రాష్ట్రంలో ధాన్యం సేకరణలో మొదటి స్థానంలో ఉన్న నిజామాబాద్ ఉమ్మడి జిల్లా సీఎంఆర్ సేకరణలో మాత్రం అబాసుపాలవుతోంది. ప్రభుత్వం రైతులకు డబ్బులు చెల్లించి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మర ఆడించేందుకు రైసు మిల్లర్లకు అప్పగించి చేతులు దులుపుకుంటోంది. రెండేళ్లు గడిచిన వారి నుంచి సీఎంఆర్ మాత్రం రికవరీ చేయడం లేదు. ప్రతీ సీజన్‌లో మూడు నెలల గడువుతో సీఎంఆర్ కేటాయిస్తు‌న్న సివిల్ సప్లయ్ అధికారులు తర్వాత మిల్లర్ల నుంచి రైస్‌ను సేకరించడం మాత్రం మరిచిపోతున్నారు.

ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండానే, రూపాయి కరెంట్ బిల్లు రాకుండానే మూతపడిన మిల్లులను చూపి ప్రతి ఏటా మరి కొందరు ధాన్యం తీసుకుని దానిని బహిరంగ మార్కెట్లో అమ్మేసుకుంటున్నారు. ఈ విషయంపై ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా, ఎఫ్‌సీఐకి అందాల్సిన బియ్యం రాకపోవడంతో విచారణ జరిపిన అధికారులు సీఎంఆర్ కోసం గడువు ఇస్తున్నా మిల్లర్లు ఖాతరు చేయడం లేదు. 300 పైచిలుకు మిల్లులున్న నిజామాబాద్ జిల్లాలో లక్షా 60వేల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ రావాల్సి ఉంది. మొన్నటికి మొన్న ఈ నెలాఖరు గడువును నిర్ణయించిన అధికారులు అది రాకముందే 2023కు సంబంధించిన ఖరీఫ్ సీజన్ ధాన్యం కేటాయింపులు చేయడం గమనార్హం.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : 2021 నుంచి 2023 వరకు మూడు పంటలకు సంబంధించి 12,84,237 మెట్రిక్ టన్నుల బియ్యానికి గాను ఇప్పటి వరకు కేవలం 7,81,870 ఇచ్చారు. 5,02,366 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతానికి 2021-22 ఖరీఫ్‌లో 6085, రబీలో 1,61,607 మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంది. 2022-23 ఖరీఫ్‌కు సంబంధించి 5,85,661 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 279 రైసుమిల్లులకు కేటాయించారు. మొత్తంగా 5 లక్షల 2 వేల మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉండగా ప్రతి నెల గడువులను పొడగిస్తునే ఉన్నారు.

నిజామాబాద్ ఉమ్మడి జిల్లా సరిహద్దులో మహారాష్ట్ర, కర్ణాటకకు ఇక్కడి ధాన్యాన్ని తీసుకెళ్లి అమ్మేసుకుంటున్నారనేది బహిరంగ రహస్యం. సీఎంఆర్ అప్పగింతకు మిల్లర్లు పీడీఎస్ బియ్యంపై ఆధారపడుతున్నారు. తక్కువ ధరకు పీడీఎస్‌ను సేకరించి దానిని ఎఫ్‌సిఐకి అప్పగించి రీసైక్లింగ్ రూపంలో రూపాయి ఖర్చు లేకుండా ధాన్యాన్నిమార్కెట్లో అమ్ముకుని దండిగా వసూళ్లు చేసుకుంటున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ప్రధాన పరిశ్రమగా రైసుమిల్లులు ఉండగా అక్కడ నుంచి వచ్చే కమీషన్లకు ఆశపడి పాలకులు, అధికారులు ఈ తతంగానని నడిపిస్తారని అపవాదు ఉంది.

నిజామాబాద్ జిల్లాలో 306 రైసుమిల్లులు ఉండగా అందులో కొందరు మాత్రమే సీఎంఆర్‌ను ఎఫ్‌సిఐకి అప్పగించి క్లీన్ చీట్‌లో ఉన్నారు. కానీ ఇచ్చిన టార్గెట్ కంటే తక్కువగా రైస్‌ను ఎఫ్‌సీఐకి ఇస్తున్న మిల్లర్లు అంతకంటే ముందే మళ్లీ ఖరీఫ్, రబీ సీజన్‌లు అంటూ దాన్యాన్ని కేటాయించుకుంటున్నారు. దానితో 2021కి సంబంధించిన సీఎంఆర్ రికవరీ కాకున్నా 2023లో ఖరీఫ్‌లో ధాన్యం కేటాయించారంటే ఏ మేరకు అవినీతి జరుగుతుందో తెలుసుకోవచ్చు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు ఎఫ్ సిఐతో పాటు కేంద్ర విజిలెన్స్ అధికారులు, రాష్ట్ర విజిలెన్స్ అధికారులు సీఎంఆర్ లోటు గురించి ప్రస్తావించారు.

జిల్లాలో సీఎంఆర్ కేటాయింపులతో పాటు పీడీ‌ఎస్ దందా విషయంపై ఏకంగా ఎఫ్‌సీఐకే ఫిర్యాదులు వెళ్లినా ఎవరు పట్టించుకునే వారే లేరు. కనీసం మిల్లర్లకు ఒక్క సీజన్ ముందు అంటే ఖరీఫ్ కేటాయింపులకు రబీ క్లియర్ చేయాలని గడువు విధించకపోవడంతో మూడేళ్లుగా ఆరు పంటలకు సంబంధించిన ధాన్యం మిల్లర్ల వద్ద ఉందో లేదో తెలియకుండానే రోటేషన్ జరుగుతుందనేది అందరికీ తెలిసిందే. దానిని ప్రాతిపదికగా మిల్లర్లు దందా నడుపుతున్నా ఇప్పటి వరకు బ్లాక్ లిస్టులో పెడుతామని హెచ్చరికలు మినహా ఒక్కరిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

మూడేళ్లు గడిచినా రెవెన్యూ రికవరి యాక్టు సంగతి దేవుడెరుగు క్రిమినల్ కేసులను కూడా అధికార యంత్రాంగాలు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నాయి. బోధన్ లో ఒక రైసుమిల్లులో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం లెక్కల్లో తేడాలున్నాయని విజిలెన్స్, ఎఫ్‌సీఐ అధికారులు గుర్తించినా ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. దీంతో మిల్లర్లు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా నడుస్తుంది. మరో ఐదు రోజులు గడువును అధికార యంత్రాంగం పొడగించిన నేపథ్యంలో ఎంత మేరకు మిల్లర్ల వద్ద నుంచి రికవరి చేస్తారో తేలనుంది.



Next Story

Most Viewed