తెలంగాణలో డబుల్ డిజిట్ గేమ్.. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ల బిగ్ స్కెచ్

by Disha Web Desk 13 |
తెలంగాణలో డబుల్ డిజిట్ గేమ్.. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ల బిగ్ స్కెచ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో ఎంపీ ఎన్నికల సందడి మొదలైంది. నిన్న ఒకే రోజు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ సభలతో హోరెత్తించాయి. డబుల్ డిజిట్ సీట్లే లక్ష్యంగా పార్టీలు ఫోకస్ పెట్టడంతో రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా మారింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో 17 లోక్ సభ స్థానాలకు గాను.. బీఆర్ఎస్ 9, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఎంఐఎం 1 స్థానంలో గెలవగా ఈసారి మాత్రం ప్రధాన పార్టీలు డబుల్ డిజిట్‌పై కన్నేసాయి.

మూడు పార్టీలది ఒకే టార్గెట్

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అదే జోష్‌తో పార్లమెంట్ ఎన్నికలలో 15 స్థానాలే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ప్రజాదీవెన సభల్లో సీఎం రేవంత్ రెడ్డి పదునైన వ్యాఖ్యలతో ప్రత్యర్థులను తూర్పారపడుతున్నారు. నిన్న రాష్ట్రానికి వచ్చిన కేంద్రమంత్రి అమిత్ షా సైతం 12 పైగా స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అలాగే బీఆర్ఎస్ సైతం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్‌పై గురి పెట్టింది. బీఆర్ఎస్ పని ఖతం అయిపోయిందనే విమర్శలకు లోక్ సభ స్థానాల్లో సత్తా చాటి సమాధానం ఇచ్చేలా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు.

పార్టీల భవిష్యత్తును తేల్చే ఎన్నికలు..

సార్వత్రిక ఎన్నికలు తెలంగాణలో ప్రధాన పార్టీల భవిష్యత్తును డిసైడ్ చేయబోతున్నాయనే చర్చ సాగుతోంది. ముఖ్యనేతల వలసలతో బీఆర్ఎస్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుండగా ఎన్నికల్లో సత్తా చాటి తమకు ఆదరణ తగ్గలేదనేది నిరూపించుకునేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. మరోవైపు రాబోయే పదేళ్లు తమదే అధికారం అని ముఖ్యమంత్రి రేవంత్ సైతం పదే పదే ప్రస్తావించడం హాట్ టాపిక్‌గా మారుతోంది. సౌత్ ఇండియాలో సత్తా చాటేందుకు తెలంగాణ అనువైన రాష్ట్రంగా బీజేపీ భావిస్తోంది. ఎంపీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తే ఆ తదనంతర స్థానిక ఎన్నికల్లో అదే హవా కొనసాగించవచ్చని పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డబుల్ డిజిట్ డ్రీమ్ ఏ పార్టీని వరిస్తుందో చూడాలి.

Next Story

Most Viewed