డైలమాలో డీఎంఈ..! వయో పరిమితి బిల్లు రిజెక్ట్

by Disha Web Desk 4 |
డైలమాలో డీఎంఈ..! వయో పరిమితి బిల్లు రిజెక్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలోని హెచ్​వోడీల ఏజ్‌ను 61 ఏళ్ల నుంచి 65 సంవత్సరాలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లుకు గవర్నర్ నో చెప్పడంతో గందరగోళం నెలకొన్నది. వయో పరిమితి బిల్లు తిరస్కరణకు గురి కావడంతో సర్కార్​కు గట్టి షాక్​ తగిలినట్లైంది. అంతేగాక ఇన్ ఛార్జ్ ​విధానంలో డీఎంఈ నియమించడంపై(జీవో 603–2017) కూడా కోర్టు స్టే ఇచ్చినట్లు సమాచారం. ఈ రెండు నిర్ణయాలతో ప్రస్తుత డీఎంఈ డాక్టర్ రమేష్​రెడ్డి డైలమాలో ఉన్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయా? అని రమేష్​రెడ్డి ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి తన కార్యచరణ ఉంటుందని డీఎంఈ డాక్టర్​ రమేష్​రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

ఏజ్​ లిమిట్​తో సమస్య..

ప్రస్తుతం మెడికల్ ఎడ్యుకేషన్ ​విభాగంలో రెండు వయోపరిమితులు ఉన్నాయి. ప్రోఫెసర్లకు 65 ఏళ్లు, గవర్నర్​ తిరస్కరించిన బిల్లు ప్రకారం హెచ్​వోడీలకు 61 ఏళ్లుగా ఉన్నది. ఈ వ్యత్యాసంతోనే పలు సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నదని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి మెడికల్‌ కాలేజీల్లోని ప్రొఫెసర్ల సీనియారిటీ ఆధారంగా డీఎంఈ, అడిషనల్‌ డీఎంఈ, ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్లుగా పోస్టింగ్‌ ఇస్తారు. కానీ ప్రొఫెసర్ల వయో పరిమితి 65 ఏళ్లు కొనసాగుతూ, అడిషనల్‌ డీఎంఈలు, ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్ల వయో పరిమితి 61 ఏళ్లకు పరిమితం చేస్తే ఇబ్బందులు వస్తాయని అధికారులు చెబుతున్నారు.

ఒకసారిఈ హెచ్​వోడీ పోస్టులకు వస్తే 61 ఏళ్లకే రిటైర్డ్​కావాల్సి ఉంటుంది.అదే ప్రోఫెసర్​గా ఉండే 65 ఏళ్ల వరకు పనిచేయొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రోఫెసర్​నుంచి పదోన్నతులు పొంది హెచ్​వోడీ పోస్టులకు వెళితే ముందుగానే సర్వీస్​ను వదుకోవాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో హెచ్​వోడీ పోస్టుల్లో పనిచేసేందుకు ఎవరూ ముందుకు రారని వైద్యాధికారులు స్పష్టం చేస్తున్నారు.

అంతేగాక ఒకసారి హెచ్​వోడీ పోస్టు తీసుకుంటే 61 ఏళ్ల వయో పరిమితి మాత్రమే వర్తిస్తుంది.అక్కడ వారి పదవి పోతే తిరిగి ప్రొఫెసర్‌గా 65 ఏళ్లు ఉండే అవకాశాన్ని కూడా కోల్పోతారు.దీంతో పాటు జిల్లాల్లోని మెడికల్‌ కాలేజీలకు ప్రిన్సిపాల్‌గా వెళ్లడం కంటే హైదరాబాద్‌లో ప్రొఫెసర్‌గా 65 ఏళ్ల వరకు పనిచేసుకోవడమే మంచిదన్న అభిప్రాయంతోకూడా చాలా మంది ఉంటారని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇదే జరిగితే రాబోయే రోజల్లో వైద్య, వైద్యలో సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉన్నదని వైద్యాధికారులు నొక్కి చెబుతున్నారు.

కొత్త మెడికల్​ కాలేజీలకు సవాళ్లు..

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకో మెడికల్​ కాలేజీలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. దీని ప్రకారం ప్రతి మెడికల్​ కాలేజీకి ప్రిన్సిపల్​, ఆయా అనుబంధ ఆసుపత్రికి సూపరింటెండెంట్​ను నియమించాల్సి ఉంటుంది. అంటే సీనియారిటీతో కూడిన ప్రోఫెసర్లకు పదోన్నతులు కల్పిస్తూ హెచ్​వోడీ పోస్టులు అప్పగిస్తారు.అయితే ఇప్పుడు విభాగాధిపతుల పదవీ విరమణ వయసు బిల్లు తిరస్కరణకు గురికావడంతో పదోన్నతులు తీసుకునేందుకు ఆధ్యాపకులు ముందుకు వచ్చే ఛాన్స్​తక్కువే. దీంతో కొత్త మెడికల్​ కాలేజీలు, ఆసుపత్రులకు ప్రిన్సిపాల్స్​, సూపరింటెండెంట్లు కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నది.దీంతో కాలేజీలను సమర్థవంతంగా నడపడానికి ప్రభుత్వానికి పెద్ద చిక్కులు వచ్చే ప్రమాదం ఉన్నది.

ఆరుగురు అనర్హులు...

తాజాగా గవర్నర్​నిర్ణయంతో డీఎంఈ కార్యాలయంలో పనిచేసే ఆరుగురు అధికారులు అనర్హులు అవుతారు. వీరిలో ప్రస్తుత ఇంచార్జీ డీఎంఈ డాక్టర్​రమేష్​రెడ్డి కూడా ఉన్నారు. వీరందరికీ 61 ఏళ్లు పూర్తయినట్లు సమాచారం. దీంతో పాటు వచ్చే ఏడాదిలోగా మరో ఏడెనిమిది మంది అనర్హులవుతారని ప్రభుత్వం అంచనా. ప్రభుత్వం రెండో సారి గవర్నర్​కు బిల్లు పంపకుండా, కోర్టు మెట్లు ఎక్కకుండా, ఇదే రూల్​ను అమలు చేస్తే.. అడిషనల్​​డీఎంఈ, కాలేజీల ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లుగా ఎంత మంది ముందుకు వస్తారనేది? సర్కార్ డైలమాలో ఉన్నది. ఇదిలా ఉండగా, ఈ ఏడాది కొత్తగా రాబోతున్న మెడికల్​ కాలేజీలను కలుపుకొని రాష్ట్రంలో 26 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలున్నాయి. వాటిల్లో ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లు కలిపి 52 మంది హెచ్​వోడీలు ఉండాలి. వీళ్లతో పాటు డీఎంఈ కార్యాలయంలో ముగ్గురు అడిషనల్‌ డీఎంఈలు, ఒక డీఎంఈ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది.

Next Story