New Secretariat అగ్ని ప్రమాదం.. శుభ పరిణామం అంటున్న ఓ మంత్రి

by Disha Web Desk 12 |
New Secretariat అగ్ని ప్రమాదం.. శుభ పరిణామం అంటున్న ఓ మంత్రి
X

దిశ, తెలంగాణ బ్యూరో: కొత్త సచివాలయంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న అగ్నిప్రమాదం పై అనేక అనుమానాలు తలెత్తాయి. యాదృచ్ఛికమా..? నిర్లక్ష్యమా..? ఇతర కారణాలేమైనా ఉన్నాయా..? అంటూ చర్చలు జోరందుకున్నాయి. ఒక మంచి కార్యక్రమం తలపెట్టే సమయంలో అగ్నిప్రమాదం జరగడం శుభపరిణామమని ఓ మంత్రి వ్యాఖ్యానించారు. అద్భుతమైన కట్టడాన్ని నిర్మిస్తుండడంతో ఇంతకాలం తగిలిన దిష్టి పోయిందంటూ మరో మంత్రి కామెంట్ చేశారు.

చిన్న ఫైర్ యాక్సిడెంట్ మాత్రమేనని, ఇది మాక్ డ్రిల్‌లో భాగంగా జరిగిందని కొందరు అధికారులు చెప్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని మరో వాదన. ఈ నెల 17న గ్రాండ్‌గా ప్రారంభోత్సవం జరగనున్న సమయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి సైతం అంతే ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. తమిళనాడు, జార్ఖండ్ ముఖ్యమంత్రులతో పాటు బీహార్ ఉప ముఖ్యమంత్రిని కేసీఆర్ ఆహ్వానించారు. వారు కూడా సానుకూలంగానే స్పందించారు. ప్రారంభోత్సవానికి ముందు అగ్ని ప్రమాదం జరగడంతో దీని ప్రభావం పైన, ప్రారంభోత్సవానికి చేస్తున్న ఏర్పాట్లకు కలిగే విఘాతంపైనా ముఖ్యమంత్రి ఇప్పటికే ఆరా తీశారు.

ఒకట్రెండు రోజుల్లో స్వయంగా అక్కడకు వెళ్లి పరిశీలించే అవకాశం ఉన్నట్లు అధికారుల సమాచారం. వివిధ పనులు ఏకకాలంలో మూడు షిప్టుల వారీగా జరుగుతున్నాయి. రోడ్లు, భవనాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సైతం అధికారులతో రెగ్యులర్‌గా సమీక్షిస్తున్నారు.

అగ్నిప్రమాదంపై వాస్తవాలు వెలుగులోకి రావాలంటే అన్ని పార్టీల ప్రతినిధులను పరిశీలన కోసం అనుమతించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల తదితరులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంబేద్కర్ పేరు పెట్టుకుని కేసీఆర్ పుట్టిన రోజు ప్రారంభోత్సవ ముహూర్తం నిర్ణయించడం సరికాదని, దేవుడు కూడా అందుకు ఒప్పుకోలేదని, అందుకే ఫైర్ యాక్సిడెంట్‌తో ఆటంకాలు ఎదురయ్యాయని ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ వ్యాఖ్యానించారు. ప్రారంభోత్సవం కాకముందే అగ్ని ప్రమాదం జరిగితే ఆ భవనంలో రక్షణ ఎక్కడ అనే విమర్శలు మొదలయ్యాయి.

దిష్టి తొలగిపోయింది..

అగ్నిప్రమాదం జరగడం శుభ పరిణామమే కదా.. అంటూ గులాబీ నేతల నుంచి కామెంట్లు రావడం సరికొత్త సందేహానికి తావిచ్చినట్లయింది. కేసీఆర్ యజ్ఞాలు చేసినప్పుడు పూర్ణాహుతి రోజున అగ్ని ప్రమాదం జరుగుతూ.. ఉండడం ఒక ట్రెండ్‌గా మారింది. ఉప ఎన్నికల్లో విజయం లభించిన తర్వాత తెలంగాణ భవన్‌లో జరిగే సంబురాల సందర్భంగానూ స్వల్ప అగ్నిప్రమాదాలు జరగడం ఆనవాయితీగా మారింది. ఇప్పుడు సచివాలయం పనులు దాదాపుగా పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న సమయంలో తెల్లవారుజామున ఊహకు అందని తీరులో స్వల్ప ప్రమాదం జరగడం చర్చకు తావిచ్చినట్లయింది.

ఫైర్ యాక్సిడెంట్ కారణంగా సెక్రటేరియట్ ను సీఎం కేసీఆర్ తొందర్లోనే పరిశీలించే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదంతో పెద్దగా నష్టమేమీ లేకపోయినప్పటికీ దిద్దుబాటు చర్యలు తీసుకోడానికి పట్టే సమయం, ప్రారంభోత్సవానికి కలిగే ఆటంకం తదితరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని, ఇప్పటివరకైతే ప్రారంభోత్సవం విషయంలో ఎలాంటి మార్పు లేదని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి : సచివాలయంలో అగ్నిప్రమాదం.. యాధృచ్ఛికమా?.. నిర్లక్ష్యమా?


Next Story

Most Viewed